చంద్రబాబు - పవన్ "అధికార" ఒప్పందం ఇలా : సీబీఐ మాజీ జేడీ..!!
ఏపీలో ఇప్పుడు పొత్తుల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన పొత్తు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ వ్యవహారం తేలాల్సి ఉంది. ఈ సమయంలో అప్పుడే ఈ రెండు పార్టీలు అధికారంలోకి వస్తే సీఎం ఎవరు..డిప్యూటీ సీఎం ఎవరు అనే అంశం పైన చర్చలు మొదలయ్యాయి. టీడీపీ -జనసేన అధికారంలో వస్తే అధికార పంపకాలు ఎలా ఉంటాయనే అంశం పైన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. ఒక ఇంట్వర్యూలో దీనికి సంబంధించి తన అభిప్రాయాలను వెల్లడించారు.

పవన్ అభిమానుల కోరిక అదే
పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్న విషయాన్ని మాజీ జేడీ గుర్తు చేసారు. అదే సమయంలో తిరిగి సీఎంగానే సభలో అడుగు పెడతానంటూ చంద్రబాబు చేసిన శపథం గురించి లక్ష్మీనారాయణ ప్రస్తావించారు. దీంతో, చంద్రబాబు ముఖ్యమంత్రిగా.. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేసారు. డిప్యూటీ సీఎంగా పవన్ అంగీకరిస్తారా అంటే గతంలో ఒక సినిమాలో అవసరమైన చోట తగ్గాలంటూ పవన్ చెప్పిన డైలాగ్ ను మాజీ జేడీ గుర్తు చేసారు. అలా కాకపోతే, చెరి రెండున్నారేళ్లు సీఎంగా అధికారం పంచుకొనే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే ఇదే ఫార్ములా కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్ వంటి చోట్ల అమలు చేసారని వివరించారు.

చెరి రెండున్నారేళ్లు సీఎంగా
ముందుగానే ఎవరికి ఏ శాఖలు ఇవ్వాలనే దాని పైన నిర్ణయం ఉంటుందన్నారు. ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్లే సీఎం అవుతారనేది ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్లో పొత్తు సమయంలోనే చేసుకుంటున్న ఒప్పందంగా వివరించారు. ఇక, ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ప్రస్తుతం ఆ రెండు పార్టీల నేతలు కలిసి పని చేయటానికి నిర్ణయించిన విషయాన్ని లక్ష్మీనారాయణ ప్రస్తావించారు. ప్రధాని రాజధాని కోసం శంకుస్థాపన చేసి ఏడేళ్లు అయిందని, భూములు ఇచ్చిన రైతులు రోడ్ల మీద ఉన్నారని వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల పేరుతో కొందరు గర్జనలు చేస్తున్నారన్నారు. రాజధాని ఎలా ఉండాలనేది కౌటిల్యుడు అర్ద్రశాస్త్రంలో స్పష్టం చేసారని చెప్పారు.

నదీ ఒడ్డునే రాజధాని ఉండాలి
రాజధాని రాష్ట్రానికి మధ్యలో, నదీ ఒడ్డున ఉండాలని ఆనాడే కౌటిల్యుడు చెప్పిన అంశాన్ని మాజీ జేడి చెప్పుకొచ్చారు. నాలుగు భనవాలు కడితే అది రాజధాని కాదని, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అక్కడ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేస్తే, రాయలసీమ వాసులు ప్రశ్నిస్తే ఏం చెబుతారని నిలదీసారు. కేపిటల్ లొకేషన్ - అభివృద్ధికి సంబంధం లేదని, రాష్ట్రంలోని ప్రతీ జిల్లా అభివృద్ధి కావాల్సి ఉంటదని సీబీఐ మాజీ జేడీ లక్షీనారాయణ విశ్లేషించారు. ఇక, టీడీపీ - జనసేన గురించి సీబీఐ మాజీ జేడి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications