YS Jagan: జగన్ విదేశీ పర్యటనపై సీబీఐ నిర్ణయం ఇదే..!
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సీఎం జగన్ సిద్దమవుతున్నారు.ఇందులో భాగంగా గతంలో అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు పెట్టిన షరతులను సడలించాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు.. సీబీఐ అభిప్రాయం కోరింది. దీంతో సీబీఐ ఇవాళ అఫిడవిట్ రూపంలో తన అభిప్రాయం కోర్టుకు సమర్పించింది.
ఇందులో వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ అభ్యంతరం తెలిపింది. జగన్ విదేశీ టూర్ కు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోర్టును కోరింది. ఇప్పటికే ఓసారి విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారని, ఇప్పుడు ఆయనపై నమోదైన అక్రమాస్తుల కేసులో విచారణ కీలక దశలో ఉన్న తరుణంలో విదేశాలకు వెళ్లేందుకు అనుమతించవద్దని సీబీఐ కోర్టును కోరింది. దీనిపై సీబీఐ కోర్టు తన నిర్ణయాన్ని ఈ నెల 14కు వాయిదా వేసింది.

వాస్తవానికి రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ పూర్తయ్యాక మే 17న కుటుంబంతో కలిసి లండన్ వెళ్లేందుకు జగన్ ప్లాన్ చేసుకున్నారు. లండన్ లో చదువుకుంటున్న కుమార్తె వద్దకు వెళ్లి.. అక్కడి నుంచి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వెళ్లేందుకు జగన్ షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు.
అయితే సీబీఐ మాత్రం భిన్నంగా ఆలోచిస్తోంది. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో విచారణ ఆలస్యమవుతుండటంపై నేరుగా సీబీఐ కోర్టు తాజాగా సీరియస్ అయింది. ఇలాంటి తరుణంలో మరోసారి విదేశీ పర్యటనకు.. అదీ 15 రోజుల పాటు అనుమతి ఇవ్వడం సరికాదని భావిస్తోంది. అయితే సీబీఐ కోర్టు దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.












Click it and Unblock the Notifications