అవినాశ్ కోసం ఆస్పత్రికి వచ్చిన సీబీఐ - పోలీసు బలగాలు, హై టెన్షన్..!!
కడప ఎంపీ అవినాశ్ వ్యవహారంలో సీబీఐ కీలక చర్యలకు సిద్దం అవుతోంది. ఇప్పటికే రెండు సార్లు విచారణ నుంచి వాయిదా కోరిన అవినాశ్ కు ఈ రోజు తప్పని సరిగా రావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేసింది. తన తల్లికి అనారోగ్యం కారణంగా తాను విచారణకు రాలేనని..పది రోజుల సమయం కావాలని కోరుతూ అవినాశ్ లేఖ రాసారు. ఇప్పుడు అవినాశ్ తన తల్లికి చికిత్స అందిస్తూ కర్నూలు ఆస్పత్రిలోనే ఉన్నారు. అక్కడకు సీబీఐ అధికారులు చేరుకున్నారు.
కర్నూలు చేరిన సీబీఐ : వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో ఉత్కంఠ కొనసాగుతోంది. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ని ఇప్పటికే ఆరు సార్లు విచారించిన సీబీఐ అధికారులు ఇప్పుడు కర్నూలు చేరుకున్నారు. ఈ నెల 19 తేదీన విచారణకు రావాలని అవినాశ్ కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. విచారణకు బయల్దేరే సమయంలో తన తల్లికి ఆరోగ్యం క్షీణించినందనే సమాచారంతో అవినాశ్ విచారణకు హాజరు కాలేనంటూ సీబీఐకి తన న్యాయవాదుల ద్వారా లేఖ పంపారు. దీంతో, తిరిగి ఈ రోజు సోమవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. దీనికి తాజాగా అవినాశ్ సీబీఐకి మరో లేఖ రాసారు. తన తల్లి ఆరోగ్యం బాగోలేదని, తనకు పది రోజుల సమయం కావాలని కోరుతూ నేటి విచారణకు రాలేనని స్పష్టం చేసారు.

విచారణకు రాలేనన్న అవినాశ్ : ప్రస్తుతం అవినాశ్ తల్లి కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడి వైద్యులు కూడా అవినాశ్ తల్లి ఆరోగ్యం కొంత ఆందోళన కరంగా ఉందని ప్రకటించారు. ఈ సమయంలో అవిశాఖ విచారణకు రాలేనని చెప్పటంతో, ఇప్పుడు కర్నూలులోని ఆస్పత్రి వద్దకు సీబీఐ అధికారులు చేరుకున్నారు. ముందుగానే కర్నూలు ఎస్పీకి సమాచారం ఇచ్చారు. దీంతో ఆస్పత్రి వద్ద భారీగా పోలీసు బలగాలను మొహరించారు. అటు కడప జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో అవినాశ్ అభిమానులు చేరుకున్నారు. ఆస్పత్రి వద్ద ఉన్న అవినాశ్ అభిమానులను పోలీసులు అక్కడ నుంచి పంపించి వేస్తున్నారు. స్థానికంగా తెరిచి ఉన్న దుకాణాలను కూడా మూయిస్తన్నట్లు సమాచారం అందుతోంది.
ఇటు సీబీఐ..అటు అనుచరులు : ఆస్పత్రిలో ఉన్న అవినాశ్ తో సీబీఐ అధికారులు సమావేశమయ్యారు. సీబీఐ అధికారుల రాక సమాచారం తెలుసుకున్న అవినాశ్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఇంకా అక్కడకు చేరుకుంటున్నారు. విశ్వ భారతి ఆస్పత్రి వద్ద హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. 19వ తేదీన విచారణకు హాజరు కాకుండా అవినాశ్ పులివెందులకు బయల్దేరిన సమయంలోనూ సీబీఐ కొంత దూరం అనుసరించింది. ఆ తరువాత ఈ రోజు (సోమవారం) విచారణకు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఆస్పత్రి వద్దకు అవినాశ్ తరపు న్యాయవాదులు కూడా చేరుకుంటున్నారు. సీబీఐ పోలీసుల సహకారంతో ఆస్ప్రత్రి వద్దకు చేరుకోవటంతో ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications