కడప కేంద్రంగా సీబీఐ - విచారణ కంటిన్యూ : సునీల్ సోదరుడికి ప్రశ్నలు..!!
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కారణమైన వైఎస్ వివేకా హత్య కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసును సుదీర్ఘ కాలంగా విచారిస్తున్న సీబీఐ ఇప్పుడు కడప కేంద్రంగా మలి విడత విచారణ ప్రారంభించింది. హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే సీబీఐ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్లు..అందులో విచారణలో వెలుగులో వచ్చిన అంశాలు..స్టేటమెంట్స్ బయటకు రావటంతో అవి రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు కారణం అయ్యాయి. రాజకీయంగానూ ఆ స్టేట్ మెంట్ల ఆధారంగా ఆరోపణలు - విమర్శలకు దారి తీసాయి. అయితే, రెండు నెలల విరామం తరువాత తిరిగి ఇప్పుడు కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో అనుమానితులను ప్రశ్నించటం ప్రారంభించింది.
ఈ కేసులో నిందితుడుగా ఉన్న సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ కుమార్ యాదవ్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఇప్పటికే సునీల్ యాదవ్ కడప జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. గతంలో సునీల్ యాదవ్, కిరణ్ కుమార్ యాదవ్, తల్లిదండ్రులను కూడా సీబీఐ పలుమార్లు ప్రశ్నించింది. కిరణ్ కుమార్ యాదవ్ ను మరోసారి దాదాపు రెండు గంటల పాటు సీబీఐ అధికారులు విచారించారు. న్యాయవాది సమక్షంలో కిరణ్ ను విచారించినట్లు సమాచారం. వివేకా హత్య కేసుకు సంబంధించి పలు అంశాలపై కిరణ్ కుమార్ యాదవ్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి విచారణలో భాగంగా సీబీఐకి వెల్లడించిన అంశాలు..స్టేట్ మెంట్ ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా మారాయి.
హత్య జరిగిన రోజు వివేకా నివాసంలో సేకరించిన ఆనవాళ్లతో పాటుగా వివేకా వ్యక్తిగత సహాయకుడు..పని మనిషి నుంచి సీబీఐ వివరాలు సేకరించింది. అదే విధంగా పులివెందుల లో హత్య రోజున ఘటనా స్థలికి ఎవరు చేరుకున్నారు...ఎవరు ఏం చేసారనే దానితో పాటుగా అప్పటి పోలీసు అధికారుల నుంచి సమాచారం తీసుకుంది. రాజకీయంగా ఈ కేసు సంచలనంగా మారటంతో..సీబీఐ రెండు నెలల విరామం తరువాత కడప కేంద్రంగా తిరిగి ప్రారంభించిన విచారణ..సీబీఐ తరువాతి అడగుల పైన ఆసక్తి నెలకొని ఉంది.