జగన్కు షాక్!: 11వ ఛార్జీషీట్లో సమన్లు, వైవీకి కూడా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్! అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు 11వ చార్జీషీట్ను విచారణకు స్వీకరించింది. ఇందూ గృహ నిర్మాణ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ రూపొందించిన చార్జీషీట్ను శనివారం స్వీకరించింది.
అలాగే ఈ కేసు విచారణకు నిమిత్తం డిసెంబర్ 19న న్యాయస్థానానికి హాజరుకావాలని జగన్ను కోర్టు ఆదేశించింది. వైవీ సుబ్బారెడ్డి, విజయ సాయిరెడ్డి, ఐఏఎస్ అధికారి మహంతి, ఇందూ అధినేత శ్యాంప్రసాద్ రెడ్డి, వీవీ కృష్ణ ప్రసాద్, జితేంద్ర వీర్వాణిలకు కోర్టు సమన్లు జారీ చేసింది.
ఇందూ - గృహ నిర్మాణ మండలి ఒప్పందలాకు సంబంధించిన అవకతవకల పైన దర్యాఫ్తు చేసిన సీబీఐ సెప్టెంబర్ 9న అభియోగపత్రం దాఖలు చేసింది. దీనిని సీబీఐ కోర్టు శుక్రవారం విచారణ నిమిత్తం పరిగణలోకి తీసుకుంది. నిందితులైన జగన్, విజయ సాయి రెడ్డి, మహంతి, శ్యాంప్రసాద్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వీవీ కృష్ణప్రసాద్, జితేంద్ర వీర్వాణీలతో పాటు సైబరాబాద్ హైటెక్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ప్రై.లి., వసంత ప్రాజెక్ట్స్ ప్రై.లి. ఇందూ ఈస్ట్ర్న్ ప్రావిన్స్ ప్రాజెక్ట్స్ ప్రై.లి., ఎంబసీ రియల్టర్స్ ప్రై.లి., ఇందూ రాయల్ హోమ్స్ ప్రై.లి., కార్మెల్ ఏషియాల తరఫున శ్యాంప్రసాద్ రెడ్డి, కృష్ణప్రసాద్, జితేంద్ర వీర్వాణీ, జగన్లకు సమన్లు జారీ అయ్యాయి.
డిసెంబర్ 19న హాజరై కోర్టు సూచించిన పూచీకత్తులు సమర్పించాల్సి ఉంటుంది. అదే రోజు నిందితులకు అభియోగప్రతులను కోర్టు అందజేయనుంది.
ఇందూ ప్రాజెక్ట్స్కు తగిన అర్హత లేకపోయినప్పటికీ గృహ నిర్మాణ మండలి నాలుగు హౌసింగ్ ప్రాజెక్టులను అప్పగించిందనే అభియోగం ఉంది. ఆర్థిక సామర్థ్యం ఉన్న ఎంబసీ - యూనిటీ, సోమా తదితరుల కంపెనీలతో కలిసి కన్సార్టియంగా ఏర్పాటు చేసి, ఆ పైన వాటన్నింటినీ తప్పించి ఇందూ గ్రూపు అక్రమంగా ప్రాజెక్టులు దక్కించుకుందని వాదన.
గచ్చిబౌలిలో 4.29 ఎకరాలు, బండ్లగూడలో 50 ఎకరాలు, కూకట్ పల్లిలో 65 ఎకరాలు, కర్నూలు జిల్లా నంద్యాలలో 76 ఎకరాల ప్రాజెక్టులను ఇందూ పొందింది. వైయస్ ప్రభుత్వం సహకారంతో ప్రాజెక్టులను పొందినందుకు ప్రతిఫలంగా జగన్కు చెందిన కార్మెల్ ఏషియాలో ఇందూ పెట్టిబడులు పెట్టిందన్నది సీబీఐ ఆరోపణ. ఈ ఛార్జీషీటుకు సంబంధించి 46 డాక్యుమెంట్లతో పాటు 38 మందిని సీబీఐ సాక్షులుగా పేర్కొంది.