కలకలం: తిరుపతి సిండికేట్ బ్యాంక్లో రూ.5కోట్ల కుభంకోణం, సీబీ‘ఐ’
జిల్లాలోని తిరుపతి సిండికేట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో జరిగిన భారీ కుంభకోణం స్థానికంగా కలకలం రేపింది.
చిత్తూరు: జిల్లాలోని తిరుపతి సిండికేట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో జరిగిన భారీ కుంభకోణం స్థానికంగా కలకలం రేపింది. గృహ రుణాల మంజూరులో రూ.5 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. తిరుపతిలోని సంజీవయ్యనగర్లో ఉన్న బ్యాంక్ ప్రధాన కార్యాలయంతోపాటు ఆరు శాఖల్లో తనిఖీలు నిర్వహించారు.
గృహ రుణాలు, గృహ తనఖా రుణాల మంజూరులో రూ.5.08 కోట్ల అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆ బ్యాంక్ ప్రాంతీయ మేనేజర్ అనూరాధ అక్టోబర్ 31న సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇందులో ప్రధానంగా బ్యాంక్ మేనేజర్ మహ్మద్ హఫీజ్తోపాటు అధికారులు ఉమామహేశ్వరి, మురుగయ్య, వెంకటరత్నం, పవన్కుమార్లపై ఫిర్యాదు చేశారు. వీరు 16 మందికి గృహరుణాలతోపాటు, 8మందికి గృహ తనఖా రుణాలను మంజూరు చేయడంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
సదరు బ్యాంక్ ప్రాంతీయ మేనేజర్ అనూరాధ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. హైదరాబాద్ నుంచి తొమ్మిది మంది సభ్యుల బృందాన్ని విచారణకు పంపింది. గురువారం ఉదయం తిరుపతికి చేరుకున్న బృందం సిండికేట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంతోపాటు ఆరు శాఖా కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. బ్యాంక్ కార్యకలాపాలను నిలిపివేసి సోదాలు నిర్వహించారు.
గురువారం రాత్రి వరకు బ్యాంకు అధికారులను విచారించారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న మీడియాతో బ్యాంక్ మేనేజర్ మహ్మద్ హఫీజ్ మాట్లాడుతూ.. తాము ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని, బ్యాంక్ లాకర్ తెరిచేందుకు హైదరాబాద్ నుంచి అధికారులు వచ్చారని తెలిపారు. ఇంతకు మించి తమకు ఎటువంటి సమాచారం తెలియదంటూ వెళ్లిపోవడం గమనార్హం. సీబీఐ అధికారులు ఈ విషయంపై ఏవైనా వివరాలు వెల్లడిస్తేనే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.