జగన్ బెయిల్ కండిషన్లను ఉల్లంఘిస్తున్నారా: తెర మీదకు కొత్త చర్చ: ఫిక్స్ చేసే ప్రయత్నం..!
ముఖ్యమంత్రి జగన్ తన బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారా. అక్రమాస్తుల కేసులో బెయిల్ మీద ఉన్న జగన్ పైన ఇప్పుడు కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. ముఖ్యమంత్రి అయిన తరువాత బాధ్యతల కారణంగా..ప్రతీ వారం కోర్టు హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని..కోర్టు సూచించిన సమయంలో తప్పనిసరిగా హాజరవుతానని ఈ మధ్య కాలంలో జగన్ సీబీఐ కోర్టును అభ్యర్దించారు. అయితే, జగన్ వాదనతో విభేదించిన సీబీఐ..హాజరుకు మినహాయింపు ఇవ్వరాదని కోర్టులో అనేక కారణాలు చూపుతూ కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో..కోర్టు జగన్ పిటీషన్ ను తోసి పుచ్చింది. ఇక, ఇప్పుడు ఇదే సమయంలో జగన్ అసలు తనకు బెయిల్ ఇచ్చిన సమయంలో కోర్టు విధించిన నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని..కేంద్రం పట్టించుకోవాలంటూ కొత్త చర్చ తెర మీదకు తీసుకొస్తున్నారు. ఇది ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.
బెయిల్ కండీషన్లు ఉల్లంఘిస్తున్నారంటూ..
ముఖ్యమంత్రి జగన్ బెయిల్ తీసుకునేటప్పుడు అంగీకరించిన నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త చర్చ లేవనెత్తారు. జగన్ తన కేసుల్లో సహ నిందితులకు మంచి పోస్టింగులు.. పదవులు ఇస్తున్నారని, ఒక నిందితురాలైన శ్రీలక్ష్మిని ఢిల్లీలో ప్రతిచోటకూ తిప్పుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎంపీగా ఉన్నప్పుడే ఆయన సాక్ష్యాలను తారుమారు చేశారని, సీఎంగా ఉంటే ఆ అవకాశం మరింత ఉంటుందని సీబీఐ తన పిటిషన్లో ముందే చెప్పిందని.. ఈ పరిణామాలు దాన్ని రుజువు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ చర్యలు జగన్ బెయిల్ తీసుకునేటప్పుడు అంగీకరించిన నిబంధనలకు కచ్చితంగా ఉల్లంఘనే అంటూ... సాక్షులను బెదిరించబోమని.. దర్యాప్తుకు ఆటంకం కలిగించబోమని కోర్టుకు హామీ ఇచ్చారని గుర్తు చేసారు. తనకేసులు దర్యాప్తు చేసిన అధికారులను వేధింపులకు గురిచేయడం ఉల్లంఘన కిందకే వస్తుం అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు తెర లేపాయి.
దీనిని కేంద్రం పట్టించుకోవాలి...
ముఖ్యమంత్రి జగన్ బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారనే విషయాన్ని..కేంద్రం సైతం పట్టించుకోవాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతంలో తన కేసులను విచారించిన అధికారి పైన ఉద్దేశ పూర్వకంగానే కక్ష్యా సాధింపు చర్యలకు దిగుతున్నారని కీలక వ్యాఖ్యలు చేసారు. కేంద్ర అధికారిపై రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చర్య తీసుకునే అధికారం లేకపోయినా తీసుకున్నారంటూ కృష్ణకిశోర్ సస్పెన్షన్ వ్యవహారాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్కు చెందిన జగతి పబ్లికేషన్స్ కంపెనీ ఆదాయ వ్యవహారాలపై తొమ్మిదేళ్ల కింద దర్యాప్తు చేసిన ఆదాయపు పన్ను అధికారుల బృందంలో కృష్ణకిశోర్ ఒక సభ్యుడని.. అప్పట్లో ఆ బృందం అక్రమాలను నిర్ధారించడమే ఇప్పుడు జగన్ కక్షగట్టడానికి కారణమని చెప్పారు. ఏ అధికారం లేని చోట ఏం అక్రమాలు జరిగాయని ఆయన్ను సస్పెండ్ చేశారు.. ఇది కక్ష సాధింపు కాదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.
జగన్ కేసుల విచారణలో కృష్ణకిశోర్..
జగన్ అక్రమాస్తుల వ్యవహారాల్లో నాడు ఆదాయ పన్ను శాఖ అధికారిగా ఉన్న కృష్ణకిశోర్ జగతి పబ్లికేషన్స్ కంపెనీ ఆదాయ వ్యవహారాల పైన విచారించిన అధికారి. ఆదాయం, ఆస్తులు లేని జగతి పబ్లికేషన్స్ షేర్కు ఏ విలువా లేదని, ఇంకా దాని నికర విలువ మైన స్ 18 రూపాయలని ఐటీ శాఖ తన దర్యాప్తులో తేల్చింది. ఈ లావాదేవీల కింద రూ.122 కోట్లు పన్ను చెల్లించాలని ఆ శాఖ తేల్చింది. దీనిపై జగతి అప్పీలుకు వెళ్లినప్పుడు షేర్ల విలువను కృత్రిమంగా పెంచి.. తమ ప్రభుత్వం వద్ద లాభం పొందిన వారికి వాటిని అంటగట్టి ఆదాయం గడించారని న్యాయమూర్తి తీర్పు కూడా ఇచ్చారు. ఇదే అధికారిని ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తరువాత కేంద్రం నుండి డిప్యుటేషన్ మీద ఏపీకి తీసుకొచ్చి కీలకమైన ఈడీబీ సీఈవోగా నియమించారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఆయనపైన సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో..ఇది రాజకీయంగానూ విమర్శలకు కారణమైంది.