టీడీపీ నేత జేబులో పేలిన సెల్ఫోన్: చొక్కా కాలిపోయింది
ఓ టీడీపీ నేత జేబులో ఉన్న శాంసంగ్ పేలిపోయింది. దీంతో ఆయన చొక్కా కాలిపోయింది.
అనంతపురం: ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్లు పేలుతున్న ఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, ఓ టీడీపీ నేత జేబులో ఉన్న శాంసంగ్ పేలిపోయింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండల టీడీపీ కన్వీనర్ చలపతి తన శాంసంగ్ ఫోన్ను జేబులో పెట్టుకున్నారు.
ఒక్కసారిగా మొబైల్ పేలడంతో కొంత భయాందోళనకు గురయ్యారు. ఫోన్ పేలడం కారణంగా చిన్నపాటి మంట, పొగ రావడంతో పాటు శబ్దం కూడా వచ్చింది. దీంతో ఆయన వెంటనే జేబులో నుంచి ఫోన్ ను తీసి, విసిరేశారు. ఈ ఘటనలో ఆయన చొక్కా కూడా కొంత కాలిపోయింది.

సెల్ ఫోన్ మాత్రం పూర్తిగా కాలిపోయింది. బళ్లారిలోని ఓ షోరూమ్లో కొనుగోలు చేసిన ఆ ఫోన్ను ఇప్పటి వరకు ఆయన కుమారుడు వాడాడు. అయితే, కుమారుడికి ఇటీవల కొత్త ఫోన్ కొనిచ్చిన చలపతి... ఈ ఫోన్ను తాను తీసుకున్నారు.
అప్పటి నుంచి ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ, మంగళవారం ఒక్కసారిగా అది పేలిపోయింది. జరిగిన ఘటనతో కొంత భయాందోళనకు గురైనట్లు చెప్పారు చలపతి. అయితే, ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత ఫోన్ ముక్కలను సదరు షోరూమ్ కు అప్పగించినట్టు చలపతి వెల్లడించారు.












Click it and Unblock the Notifications