సాకు పెళ్లి సంబంధం: అతను చేసేది సెల్ఫోన్ల దొంగతనం
హైదరాబాద్: పెళ్లి సంబంధం మాట్లాడుకుందామని పిలిచి సెల్ఫోన్లు ఎత్తుకుపోతున్న ఓ పాత నేరస్థుడిని హైదరాబాద్ పశ్చిమ మండలం పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి దాదాపు 85 వివిధ రకాల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం పశ్చిమ మండలం డిసిపి జిపి వినోద్ కుమార్, టప్పాచబుత్ర ఇన్స్పెక్టర్ మహ్మద్ రియాజుద్దీన్తో కలిసి నిందితుడి అరెస్టు గురించి మీడియాకు వివరించారు.
మహారాష్ట్రకు చెందిన మహ్మద్ సాదిక్ అలియాస్ సాజిత్ అలియాస్ అబ్డుల్లా (36) వృత్తిరీత్యా డ్రైవర్. మహరాష్ట్రలో కూడా ఇతనిపై పలు పోలీసు స్టేషన్లలో కేసులున్నాయి. మహరాష్ట్రలో జరిగిన మతఘర్షణల్లో కూడా ఇతను నిందితుడు. జైలు శిక్ష అనుభవించి అతను బయటచకు వచ్చాడు.
మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వచ్చిన మహ్మద్ సాదిక్ ఓ ముస్లిం యువతిని వివాహం చేసుకుని ఇక్కడే ఉంటున్నాడు. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా నేరాలు చేయడం మానుకోలేదు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి అతను ఏ పథకం రచించి అమలు చేశాడు.
ఉర్దూ దినపత్రికలో వచ్చే పెళ్లి సంబంధాల క్లాసిఫైడ్స్ చదివి, అందులో ఉన్న వరుడు కావలెను అనే క్లాసిఫైడ్లో ఉన్న నెంబర్లకు కాల్ చేసేవాడు. తాను యుకె నుంచి వచ్చాననని,త తన కుమారుడు మెడిసిన్ చదువుతున్నాడని, సంబంధం కోసం మాట్లాడాలని చెప్పేవాడు. తాను మహ్మద్ ఖాన్ జువెల్లర్స్ యజమాని స్నేహితుడినని మరికొంత మందికి ఫోన్ చేసేవాడు. పెళ్లి సంబంధం కోంస వచ్చేవారిని సమీపంలోని ఏదైనా మసీదు వద్దకు రప్పించేవాడు.
ప్రార్థనలకు సమయం అవుతోందని, ప్రార్థన చేసుకుని వచ్చి మాట్లాడుకుందామని చెప్పేవాడు. తన సెల్ఫోన్ నెట్వర్క్ పనిచేయడం లేదని, స్నేహితుడికి ఫోన్ చేయాలని, మీ ఫోన్ ఇస్తే బయటకు వెళ్లి మాట్లాడుతానని తీసుకునే వాడు. ఫోన్ తీసుకుని అక్కడి నుంచి ఉడాయించేవాడు. ఇలా అతను గత నాలుగు నెలల్లో వంద మందిని మోసం చేశాడు.
చాలా మంది ఆ విషయంపై ఫిర్యాదు చేయలేదు. కానీ న్యాయవాది అహ్మద్ సల్మాన్ ఫోన్ను తీసుకుని సాదిక్ ఉడాయించడంతో కథ మలుపు తిరిగింది. న్యాయవాది తన సెల్ఫోన్ ఎత్తుకెళ్లిన ఉదంతంపై టప్పాచబుత్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో సాదిక్ను పోలీసులు పట్టుకున్నారు.