ఆంధ్రప్రదేశ్లో సెల్ఫోన్ ధరలకు ఇక రెక్కలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెల్ ఫోన్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం సెల్ ఫోన్లపై వ్యాట్ను పెంచాలని నిర్ణయించింది. ఇంతకు ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 4 రూపాయల చొప్పున పెంచింది. కొన్ని రాష్ట్రాలు వ్యాట్ రూపంలో సెల్ ఫోన్లపై 14.5 శాతం వసూలు చేస్తూ రెవన్యూను వసూలు చేసుకుంటున్నాయి.
ఇతర రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని సెల్ ఫోన్లపై వ్యాట్ను పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఆ వ్యాట్ 4,5 శాతం మాత్రమే ఇప్పటి వరకు ఉంది. దీనికి సంబంధించి ప్రతిపాదనలను పంపించాలని ఎపి ఆర్థిక శాఖ వాణిజ్య పన్నుల శాఖకు సూచించింది. సెల్ఫోన్లపై వ్యాట్ను పది శాతం వరకు పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది.
అయితే, పేదలకు కొంత ఊరట కలిగించే విధంగా ఆ వ్యాట్ను పెంచాలని అనుకుంటోంది. 10 వేల రూపాయల పైబడి ఖరీదు చేసే సెల్ఫోన్లపై మాత్రం వ్యాట్ పెంచాలని అనుకుంటోంది. అయితే, దీనివల్ల అదనంగా ఎంత ఆదాయం సమకూరుతుందనే ఆంచనా ప్రభుత్వానికి ఇప్పటి వరకు లేదు.
మధ్యతరగతి ప్రజలు, పేదలు పది వేల రూపాయల లోపు ఖరీదు చేసే ఫోన్లను మాత్రమే కొంటారని, అందువల్ల వ్యాట్ పెంచడం వల్ల పేదలపై, మధ్యతరగతిపై భారం పడే అవకాశం లేదని అధికార వర్గాలు అంటున్నాయి. అయితే, రెవెన్యూను సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.