వరల్డ్ టాప్10లో అమరావతి: బాబు, బాబూ! జాబు ఎప్పుడు.. వైసిపి ప్లకార్డులు
నరసారావుపేట: అమరావతిని ప్రపంచంలోని తొలి పది నగరాల్లో ఒకదానికి నిలుపుతామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ధీమా వ్యక్తం చేశారు. నరసరావుపేట పురపాలక సంఘం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
1915లో ఏర్పడిన నరసరావుపేట పురపాలక సంఘం ఈ ఏడాదితో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆధ్వర్యంలో మూడురోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఆంధ్రప్రదేశ్ మంత్రులు, అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ సిరెడ్డి, జీఎంఆర్ అధిపతి గ్రంథి మల్లికార్జున రావు, సినీ దర్శకుడు కెరాఘవేంద్రరావు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. రాజధానికి ఎక్కడా జరగని విధంగా భూసేకరణ చేశామన్నారు. తమది రైతులు, పేదల ప్రభుత్వమని చెప్పారు. 2029 నాటికి భారత దేశంలో ఏపీ నెంబర్ వన్గా, 2050 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలన్నారు.
రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుందన్నారు. అమరావతిలో రింగ్ రోడ్డు వస్తుందని చెప్పారు. జెఎన్టీయూ తరఫున ఓ ఇంజినీరింగ్ కళాశాలను నర్సారావుపేటలో పెడతామన్నారు. నర్సారావుపేట శతజయంతి ఉత్సవాలు చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టమన్నారు.
నరసారావుపేటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. తెలుగువారు గర్వపడేలా అమరావతిని నిర్మిస్తామని చెప్పారు. సమైక్య రాష్ట్రానికి, నవ్యాంధ్రకు తొలి స్పీకర్లు ఇక్కడివారే (నరసారావుపేట) అన్నారు.
రాజధాని అమరావతికి దగ్గరగా ఉన్న నరసారావుపేట పెద్ద పట్టణం అవుతుందన్నారు. ఇక్కడకు పరిశ్రమలు రావాల్సి ఉందని చెప్పారు. అప్పుడే యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. తాగు, సాగు నీటి కోసం నదుల అనుసంధానం చేస్తామన్నారు.
దేశంలో క్రమశిక్షణ లోపించింది, వారిని వదిలేయండి
చంద్రబాబు మాట్లాడుతుండగా.. వైసిపి విద్యార్థి సంఘం నాయకులు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. 'బాబు.. జాబు ఎప్పుడు' అంటూ వారు ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో కొంత గందరగోళం ఏర్పడింది. దీనిపై చంద్రబాబు స్పందించారు.
సమస్యలు చెప్పుకునేందుకు ఓ విధానం ఉందని, ఓ ఐదారుగురు ప్లకార్డులు పట్టుకొని వచ్చి ఆందోళన చేస్తే దానిని ఎవరూ పట్టించుకోవద్దని, వారిని వదిలేయాలని కార్యకర్తలకు సూచించారు. అందరి సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్లకార్డులు పట్టుకున్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ దేశంలో క్రమశిక్షణ లోపించిందన్నారు.