ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్... రూ.685.12 కోట్ల నిధులు విడుదల; ఎందుకంటే!!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చాలా కాలంగా కేంద్రం వద్ద పెండింగ్ ఉన్న నిధులను విడుదల చెయ్యాలని ఇప్పటికే అనేకమార్లు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఉపాధిహామీ కూలీల చెల్లింపుల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 685. 12 కోట్ల రూపాయల మేర నిధులను విడుదల చేసింది కేంద్రం. జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు చెల్లింపులు చేయాల్సిన నిధులను కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ నాలుగు రోజుల్లో రాష్ట్ర నోడల్ ఖాతా కు జమ చేయనుంది.
కేంద్రం నిధులను విడుదల చేస్తున్న నేపధ్యంలో గత రెండు రోజులుగా 302. 96 కోట్ల మేర కూలీలకు చెల్లింపులు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వచ్చే రెండు మూడు రోజుల్లో 319 కోట్ల రూపాయలను కూలీల ఖాతాలలో జమ చేయనున్నట్లు పంచాయతీరాజ్ కమిషనర్ కోన శశిధర్ వెల్లడించారు. కేంద్రంలో రాష్ట్ర నోడల్ ఖాతాలో 622 కోట్ల రూపాయలను జమ చేయనున్న నేపథ్యంలో ఉపాధిహామీ కూలీల వేతనాల చెల్లింపులో ఎటువంటి జాప్యం జరగదని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉపాధి హామీ పథకం నిధులను జగన్ ప్రభుత్వం వేరే పథకాలకు మల్లిస్తోంది అని తీవ్ర ఆరోపణలు వెల్లువగా మారాయి. ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీలకు సకాలంలో వేతనాలు అందడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నిధులు విడుదల చేస్తున్న క్రమంలో రాష్ట్రప్రభుత్వం కూలీలకు చెల్లించాల్సిన డబ్బులను చెల్లిస్తోంది. ప్రతిపక్ష పార్టీల విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నంలో ఉంది.