కేంద్రం నుంచి ఏపీకి మరో భారీ ప్రాజెక్టు: చంద్రబాబు కృషి ఫలిస్తుందా?
అమరావతి: రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిధుల విషయంలో ఏపీకి మొండిచేయి చూపిస్తూనే ఉంది. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిధులు కేటాయించకపోవడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
అయితే బీజేపీ వాదన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అనుకున్న దానికంటే ఎక్కువగానే నిధులిస్తామని చెప్తోంది. అయితే ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం మరో భారీ ప్రాజెక్టు ఇవ్వనుందని సమాచారం.
దాదాపు 15 వేల కోట్ల రూపాయాల అంచనా వ్యయంతో తలపెట్టిన రెండు మెగా నౌకాశ్రయ ప్రాజెక్టులకు ఈ వారంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. తమిళనాడులోని కోలాచల్, మహారాష్ట్రలోని దహాను ప్రాంతాల్లో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ భారీ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం నిర్మించనుంది.
"ఈ రెండు ప్రాజెక్టులకూ తదుపరి క్యాబినెట్ సమావేశంలో అనుమతి రానుంది. మరో రెండు పోర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చాయి. వాటిల్లో ఒకటి ఏపీలో, మరొకటి మహారాష్ట్రకు కేటాయించారు. వీటిని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీకి పంపుతాం. వచ్చే నెలలో అనుమతులు రావచ్చని భావిస్తున్నాం" అని షిప్పింగ్ మినిస్ట్రీ అధికారి ఒకరు వెల్లడించారు.
ప్రస్తుతం భారత్లో 12 ప్రధాన ఓడరేవులు ఉన్నాయి. వాటి ద్వారా ప్రభుత్వానికి సంవత్సరానికి 60 కోట్ల టన్నుల సరకు రవాణా జరుగుతోంది. వచ్చే ఐదేళ్లలో దీన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ప్రధాని మోడీ సర్కారు ప్రణాళికలు రూపొందించింది.
ఈ క్రమంలో తమిళనాడులోని కోలాచెల్లో ముందుగా రూ. 6 వేల కోట్లతో నౌకాశ్రయ నిర్మాణం చేపట్టి తొలి దశను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. మొత్తం 3 దశల్లో నిర్మితం కానున్న ఈ పోర్టుకు రూ. 21 వేల వరకూ ఖర్చవుతుందని అంచనా.
ఆ తర్వాత ఏడాదికి 5 కోట్ల టన్నుల సరకు రవాణాకు ఇది ఉపయోగపడుతుంది. దీనికోసం సముద్ర తీరం నుంచి 500 ఎకరాల భూమి అవసరమవుతుంది. ఇక మహారాష్ట్రలోని దహాను పోర్టు విషయానికి వస్తే, ముంబైకి 150 కి.మీ దూరంలోని సముద్ర తీరం నుంచి 20 మీటర్ల లోతు వచ్చే వరకూ అంచున నిర్మించనున్నారు.
ఈ వారంలో అనుమతులు లభిస్తే ఏపీలో నిర్మించ తలపెట్టిన భారీ పోర్టు ప్రాజెక్టు ద్వారా రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింతగా ముందుకు దూసుకుపోతుందని అంచనా వేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టను ఏపీకి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారు.