అమరావతికి రాయితీలు ఇవ్వలేం: ఎంపీల ప్రశ్నలకు కేంద్రం జవాబు
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి పన్ను రాయితీలు ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసింది. లోక్సభలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఏపీకి పన్ను రాయితీలు ఇవ్వాలని అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా వివరించారు.
శుక్రవారం లోక్సభలో అమరావతిని వెనకబడిన ప్రాంతంగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 32(1)(ఐఐఏ) కింద అదనపు తరుగుదల భత్యం 35 శాతం ఇవ్వాలని, సెక్షన్ 32ఏడీ కింద 15శాతం పెట్టుబడి భత్యం ఇవ్వాలని ఆయన కోరారు.
రాజధాని అభివృద్ధిలో భాగంగా భూసేకరణలో భూములు ఇచ్చిన రైతలకు మూలధనంపై వచ్చే లాభాలపై పన్ను ప్రయోజనాలను కల్పించాలని కూడా కోరారు. దీనికి తోడు భూసేకరణ చట్టంలోని సెక్షన్ 96లో ఉన్న సముచిత పరిహార హక్కుకు అనుగుణంగా ఈ ప్రయోజనాలు కల్పించాలని ఏపీ ప్రభుత్వం తరుపున ఆయన కోరారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను పరిశీలించామని, అయితే వీటికి అంగీకరించడం సాధ్యం కాదని ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తేల్చి చెప్పారు. ఏపీని ఎక్సైజ్ సుంకాన్ని మినహాయించాలని కూడా రాష్ట్రప్రభుత్వం కోరిందని అయితే దీని వల్ల సమస్యలు తలెత్తుతాయని చెప్పారు.
ప్రాంతం ఆధారంగా పన్ను మినహాయింపులకు కేంద్రం సుముఖంగా లేదని, ఇలాంటి వాటి వల్ల ఆర్థిక వ్యవస్థలో సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. దీనికి అనేక కారణాలను సాకుగా చూపిస్తూ ఏపీకి ఎక్సైజ్ సుంకం ప్రయోజనాలు కల్పించలేదని మంత్రి స్పష్టం చేశారు.
సీఆర్డీఏ అభివృద్ధి ప్రాజెక్టు కోసం రూ.5,073 కోట్ల ప్రపంచబ్యాంకు రుణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని, దీనికి ఆర్థిక సంఘం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడించారు.
రెవెన్యూ లోటు సాయంగా రూ. .22,113 కోట్లు
ఆంధ్రప్రదేశ్కు రెవన్యూ లోటు ఉందని 14వ ఆర్థిక సంఘం తేల్చిచెప్పిందని కేంద్రమంత్రి జయంత్సిన్హా వెల్లడించారు. 2015-16 తర్వాత నుంచి 14వ ఆర్థికసంఘం అవార్డు కాలవ్యవధి ముగిసే వరకు రాష్ట్రం రూ.22,113 కోట్ల సాయాన్ని అందుకుంటుందని లోక్సభలో వెల్లడించారు. చిత్తూరు టీడీపీ ఎంపీ డాక్టర్ ఎన్.శివప్రసాద్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
రెండేళ్ల కాలంలో ఏపీకి రూ. 73 వేల కోట్ల సాయం
కేంద్ర పన్నుల్లో వాటాతో పాటు ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల కింద 2014-15, 2015-16 సంవత్సరాల్లో ఏపీకి మొత్తం రూ. 73 వేల కోట్ల ఆర్ధిక సాయం చేసినట్లు కేంద్రం లోకసభలో తెలిపింది. అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
కరువు సాయంగా రూ. 1,019 కోట్లు
తెలుగు రాష్ట్రాలకు 2015-16లో కరువు సాయంగా రూ. 1,019 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ సహాయ మంత్రి ఎం.కె కుందారియా తెలిపారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సయమంలో ఈ విషయాన్ని వెల్లడించారు.












Click it and Unblock the Notifications