సీఎం జగన్కు బీజేపీ భారీ షాక్.. రాజధాని తరలింపు అసాధ్యం.. అమరావతి కోసం జేపీ నడ్డా దీక్ష ..
ఎండాకాలం సెలవుల్లో ఏపీ రాజధానికి అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైన వైసీపీ సర్కారుకు కేంద్రంలోని అధికార బీజేపీ ఊహించని షాకిచ్చింది. రాజధాని తరలింపునకు కేంద్ర ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోదని.. రాజ్యాంగపరంగానూ రాజధాని మార్పు అసాధ్యమని ఆ పార్టీ కీలక నేత, ఎంపీ సుజనా చౌదరి చెప్పారు.
గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లడిన సుజనా చౌదరి.. అమరావతిని కాపాడుకోడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రంగంలోకి దించుతామని, అమరావతిలో దీక్షకు ఆయనను ఒప్పిస్తామని సంచలన ప్రకటన చేశారు. రాజధాని తరలింపుపై బీజేపీలో కొందరు మాట్లాడుతున్న విషయాల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ తోటి ఎంపీ జీవీఎల్ నర్సింహారావుపై పరోక్షంగా మండిపడ్డారు. టెక్నికల్గా, రాజ్యాంగపరంగాఅమరావతి తరలింపు ఎందుకు సాధ్యపడదో ఇలా వివరించారు...
రాష్ట్రం పరిధిలోకి రాదు..
‘‘దేశంలో ఎలాంటి వివాదమైనా.. స్టేట్ సబ్జెక్ట్, సెంట్రల్ సబ్జెక్ట్, కాంక్రెంట్ సబ్జెక్ట్ అని మూడుంటాయి. ఈ మూడింటికీ మధ్య విభేధాలు వచ్చినప్పుడు.. పరిష్కారం చూపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. అమరావతి తరలింపు అనేది రాష్ట్ర సబ్జెక్ట్ ప్రకారం లేదు. బైప్రాక్టీస్ మాత్రమే అది రాష్ట్రం పరిధిలోకి వస్తుందన్నారు. అంటే, డెఫినెట్ గా ఈ అంశం కేంద్రం పరిధిలోకి రావాల్సిందే. గడిచిన ఐదేళ్లపాటు కొన్ని వేల కోట్ల రూపాయలను అమరావతిలో ఖర్చు చేశారు. అంత ప్రజాధనాన్ని వృధా చేయాడానికి కేంద్రం చస్తే అంగీకరించదు. బాధ్యతగల బీజేపీ వ్యక్తిగా చెబుతున్న మాటలివి..
ఆ మాటకు అర్థం వేరు..
రాజధానిని మార్చుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని కేంద్రం ఏరోజూ చెప్పలేదు. గతంలో ఒకేఒకసారి లోక్ సభలో ప్రశ్నకు బదులుగా ఈ అంశంపై కేంద్రం స్పందించింది. అప్పుడు కూడా ‘రాష్ట్ర ప్రభుత్వ పరిధి'అనే మాటను విస్తృత అర్థంలో చెప్పిందేగానీ.. రాజులు మారినప్పుడల్లా రాజధానులు మార్చే వెసులుబాటును కల్పించలేదు. కాబట్టి జగన్ తన ఇష్టానికి నిర్ణయాలు తీసుకుంటుంటే కేంద్రం, కోర్టులు చూస్తూ ఊరుకోబోవు. నిజం చెప్పాలంటే రాజ్యంగ పరంగా కూడా అమరావతిని కదిలించే వీలులేనేలేదు.
అన్నీ ఇచ్చేసిందిగా..
వైసీపీ నేతలు మాట్లాడితే కేంద్రం నిధులు అంటారు.. కానీ ఏ నిధులు ఎలా వస్తాయనేది జగన్ కు తెలియట్లేదు. రెవెన్యూలోటుకు సంబంధించి రూ.4వేల కోట్ల 2014-15లోనే ఇచ్చేసింది. అలాగే, రాజధాని అమరావతికి కూడా కేంద్రం ఇవ్వాల్సిన డబ్బును ఎప్పుడో ఇచ్చేసింది. నిర్మాణాలకు రూ.1500కోట్లు, అండర్ గ్రౌడ్ డ్రైనేజీకి మరో రూ.1000కోట్లు ఇచ్చేసింది. దాంతోపాటు అనేక కేంద్ర సంస్థలు, యూనివర్సిటీలు, హోటళ్లు తదితరాలన్నీ ఏర్పాటయ్యాయి. అంతాకలిపి సుమారు 35వేల కోట్ల రూపాయల పనులు ఇవ్వడం జరిగింది. ఇ ఖర్చంతా ఏమైపోవాలి? అందుకే, కేంద్రం గుడ్డిగా అమరావతికి ఒకే చెప్పదు.