తెలుగు రాష్ట్రాల నీటి జగడం-రంగంలోకి కేంద్రం : ఢిల్లీకి పిలుపు-ఎవరి వాదన వారిదే..!!
రెండు రాష్ట్రాల నీటి వివాదాల పరిష్కారంలో భాగంగా..కేంద్రం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో రెండు రాష్ట్రాలు సవరణలు సూచించాయి. తమ ప్రతిపాదనలు అందించాయి. వీటి పైన ఇప్పుడు కేంద్రం దృష్టి సారించింది. రెండు రాష్ట్రాల ప్రతిపాదనలపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు ప్రక్రియలో తలెత్తుతున్న సమస్యలపై చర్చించారు.
రెండు రివర్ బోర్డులతో కీలక సమావేశం
ఇందులో భాగంగా ఢిల్లీలో సోమవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్రం ఆదేశాల మేరకు గెజిట్ నోటిఫికేషన్ అమలుపై గత నెల 3, 9న బోర్డుల సమన్వయ కమిటీ నిర్వహించిన ఉమ్మడి సమావేశానికి తెలంగాణ సర్కార్ గైర్హాజరైంది. ఈ క్రమంలో గత నెల 16న నిర్వహించిన ఉమ్మడి బోర్డుల సమావేశానికి తెలంగాణ సర్కార్ ప్రతినిధులు హాజరయ్యారు. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై వీడియో కాన్ఫరెన్స్లో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్కు రెండు బోర్డుల చైర్మన్లు తమ అభిప్రాయాలను వివరించారు.
రెండు రాష్ట్రాల అభ్యంతరాలపైనే చర్చ
బోర్డు పరిధి, గెజిట్ నోటిఫికేషన్ అమలు ఖరారుపై సోమవారం నిర్వహించే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని చర్చిస్తూనే.. మరో వైపు అక్టోబర్ 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమలు దిశగానే చర్యలు చేపట్టాలని రెండు బోర్డులకు ఇప్పటికే కేంద్రం దిశా నిర్దేశం చేసింది.
కాగా, ఈ గజెట్ అమలు విషయంలో ఏపీ ప్రభుత్వం పలు సవరణలు సూచించింది. అందులో భాగంగా..కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ను స్వాగతిస్తున్నామని చెబుతూనే... ఇదే సమయంలో పలు సవరణలను ప్రతిపాదిస్తున్నామని స్పష్టం చేసింది.
ఏపీ ప్రతిపాదనలు కేంద్రం ముందు
కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడిన జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులనే బోర్డు పరిధిలోకి తీసుకుని, నిర్వహించి.. మిగతా ప్రాజెక్టుల్లో రోజు వారీ నీటి వినియోగాన్ని రెండు రాష్ట్రాల నుంచి సేకరిస్తే సరిపోతుందని... దీని వల్ల కృష్ణా బోర్డుపై భారం తగ్గుతుందని ప్రతిపాదించింది. ఉమ్మడి ప్రయోజనాలతో ఏమాత్రం సంబంధం లేని ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం బ్యారేజీలను బోర్డుల పరిధి నుంచి తప్పించాలని కోరింది. మాచ్ఖండ్, సీలేరు విద్యుదుత్పత్తి కేంద్రాలను గోదావరి బోర్డు నుంచి తప్పించాలని సూచించింది.
తెలంగాణ అభ్యంతరాల పైన స్పష్టత
ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులను అనుమతి ఉన్నట్లుగానే గుర్తించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. రాష్ట్ర విభజన తర్వాత చేపట్టిన ప్రాజెక్టులనే కొత్త ప్రాజెక్టులుగా పేర్కొనాలని... విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో పేర్కొన్న హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టులకు అనుమతి ఉన్నట్లు గుర్తించాలని డిమాండ్ చేసింది. అనుమతి లేని ప్రాజెక్టులకు ఆరు నెలలలోగా అనుమతి తెచ్చుకోవాలన్న నిబంధనను సడలించాలని సూచించింది.
కేంద్రం పరిష్కారం చూపిస్తుందా..
ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సైతం తమ ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచింది. నీటి కేటాయింపులు తేలే వరకూ గెజిట్ నోటిఫికేషన్ అమలును వాయిదా వేయాలని కోరింది. అనుమతి లేని ప్రాజెక్టులుగా గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొనడం వల్ల వాటికి రుణాలు తెచ్చుకోవడం సమస్యగా మారుతుందని వివరించింది. అనుమతి లేని ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా అనుమతి తెచ్చుకోవాలన్న నిబంధనలను సడలించాలని డిమాండ్ చేసింది.
ఇద్దరు ముఖ్యమంత్రులతోనూ త్వరలో భేటీ
దీంతో..రెండు రాష్ట్రాల అభ్యంతరాలు-సూచనల పైన కేంద్ర జలశక్తి రెండు బోర్డుల అధికారులతో చర్చించిన తరువాత మార్పుల దిశగా కార్యాచరణ సిద్దం చేసే అవకాశం ఉంది. అయితే, మార్పులకు ముందుగా రెండు ప్రభుత్వాలతోనూ మరోసారి సంప్రదింపులు చేసే అవకాశమూ కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలకు ముగింపు పలకటమే లక్ష్యంగా కేంద్రం వేస్తున్న అడుగులు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.