ఏపీ-తెలంగాణ: రూ. 1082 కోట్లతో కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి, ప్రత్యేకతలెన్నో
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలను కలుపుతూ కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదిపై రూ. 1082.56 కోట్లతో ఈ బ్రిడ్జి నిర్మించనున్నారు.
దేశంలో తొలిసారి కేబుల్, సస్పెన్షన్ ఐకానిక్ బ్రిడ్జి
కాగా, దేశంలోనే తొలిసారిగా నిర్మిస్తున్న కేబుల్, సస్పెన్షన్ ఐకానిక్ బ్రిడ్జి ఇదే కావడం గమనార్హం. 30 నెలల్లో నిర్మాణం పూర్తి చేయనున్నట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. ఐకానిక్ బ్రిడ్జి రూపు రేఖల ఫొటోలను ట్విట్టర్ వేదికగా ఆయన పంచుకున్నారు. ప్రపంచంలో 2వ, దేశంలో తొలి చరిత్రాత్మక వంతెనగా నిలవనుందని తెలిపారు.
కృష్ణా నదిపై ఐకానిక్ వంతెన ప్రత్యేకతలెన్నో..
వంతెనలో మరో విశేషమేంటంటే.. వంతెనలో పాదచారుల మార్గం గాజుతో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పొడవైన గాజు పాదచారుల నడక మార్గం, పైలాన్ల వంటి గోపురం, సిగ్నేచర్ లైటింగ్, పెద్ద నావిగేషనల్ స్పాన్ వంటి అనేక ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. నల్లమల అడవులు, ఎత్తైన పర్వతాలతో.. విశాలమైన శ్రీశైలం రిజర్వాయర్తో ఈ వంతెన అందమైన పరిసరాలను కలిగి ఉంది. భారీ పర్యాటక సంభావ్యతతో తెలంగాణ వైపు లలిత సోమేశ్వర స్వామి ఆలయం, ఆంధ్రప్రదేశ్ వైపున సంగమేశ్వరం ఆలయం ఆకర్షణీయమైన దృశ్యాలు ఆవిష్కృతమవుతాయి.
తీరనున్న 15ఏళ్ల ప్రజల కల
కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సోమశిల వద్ద కృష్ణా నదిపై ఈ వంతెన నిర్మించనున్నారు. ఈ వంతెన నిర్మానంతో ఎట్టకేలకు 15 ఏళ్ల చిరకాల స్వప్నం సాకారం కానుంది. తెలంగాణలోని కొల్లాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని రాకపోకలు సాగించాలంటే కృష్ణా నదిలో పడవ ప్రయాణమే ఒక్కటే మార్గంగా ఉండింది. అయితే, రెండు రాష్ట్రాల మధ్య రహదారి మార్గంలో రాకపోకలు సాగించాలంటే సుమారు 100 కిలోమీటర్లు చుట్టు తిరిగి రావాల్సిందే.
హైదరాబాద్-తిరుపతి మధ్య తగ్గనున్న 80 కి.మీ దూరం
తాజా వంతెనకు అనుసంధానంగా తెలంగాణలోని కల్వకుర్తి-నాగర్కర్నూల్-కొల్లాపూర్, ఏపీలోని ఆత్మకూర్-నంద్యాల మార్గాన్ని కేంద్రం ఇప్పటికే జాతీయ రహదారిగా గుర్తించింది. ఈ వంతెన పూర్తయితే హైదరాబాద్ నుంచి కడప, చిత్తూరు, తిరుపతి వైపు ప్రయాణించేవారికి కర్నూలు మీదుగా చుట్టుతిరిగి వెళ్లాల్సిన అవసరం ఉండదు. అంతేగాక, ఈ వంతెన నిర్మాణం పూర్తయితే హైదరాబాద్-తిరుపతి మధ్య 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. 2007లో కృష్ణా నదిలో పడవ మునగడంతో 61 మంది జలసమాధి అయ్యారు. దీంతో నదిపై బ్రిడ్జి నిర్మించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం వంతెన నిర్మాణానికి ఆమోదం తెలిపింది.