విశాఖను ఏపీ రాజధానిగా గుర్తించినట్లు వచ్చిన వార్తలపై కేంద్రం క్లారిటీ: రెఫరెన్స్ సిటీగా
విశాఖపట్నం: సాగర నగరం విశాఖపట్నం పేరు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. విశాఖపట్నాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పరిపాలన రాజధానిగా గుర్తించిందనే సమాచారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కిందటి నెల 26వ తేదీన లోక్సభలో లిఖితపూరకంగా విడుదల చేసిన ఓ అనెక్సర్ దీనికి కారణమైంది. అందులో రాష్ట్రాల రాజధానులు అనే కాలమ్లో వైజాగ్ అనే పేరును పొందుపరచడం దీనికి కారణమైంది.

సోషల్ మీడియాలో విస్తృతంగా..
ఇక విశాఖపట్నాన్ని రాష్ట్ర పరిపాలన రాజధానిగా కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా గుర్తించడం వల్ల- అమరావతి ప్రాంతంలో ప్రస్తుతం కొనసాగుతోన్న సచివాలయం, వివిధ శాఖలు, విభాగాధిపతుల కార్యాలయాలు తరలింపు ప్రక్రియ ముమ్మరమౌతుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా బదలాయించడంలో ఇప్పటిదాకా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్టేననే అభిప్రాయాలు విస్తృతంగా వ్యక్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అనెక్సర్ను దీనికి సాక్ష్యంగా చూపుతూ వచ్చారు అధికార పార్టీ మద్దతుదారులు.

కేంద్రం క్లారిటీ..
ఈ పరిణామాల మధ్య- ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఓ స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఆ అనెక్సర్ను ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందనే విషయంపై స్పష్టత ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కేరళలోని కన్నూర్ సభ్యుడు కుంబకూడి సుధాకరన్, అస్సాంలోని నోవ్గావ్ సభ్యుడు ప్రద్యుత్ బొర్డొలాయ్ లోక్సభలో అడిగిన ప్రశ్నలకు లిఖితపూరకంగా ఇచ్చిన సమాధానంగా ఈ అనెక్సర్ను జారీ చేశామని తెలిపింది.

వైజాగ్ పేరు ఎందుకు?
గత ఏడాది జులై 1-ఈ ఏడాది జులై 1వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు/నగరాల్లో రికార్డయిన ఇంధన ధరలు, వాటిపై ఆయా రాష్ట్రాలు విధించిన పన్నులు, సెస్, ఎక్సైజ్ డ్యూటీల మధ్య తేడాను వివరించాలంటూ కుంబకూడి సుధాకరన్, ప్రద్యుత్ బొర్డొలాయ్ అడిగిన ప్రశ్నలకు పూర్తి వివరాలతో కూడి సమాధానాన్ని ఈ అనెక్సర్ ద్వారా విడుదల చేశామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో మూడో నంబర్ కాలమ్లో పొందుపరిచిన రాజధానుల పేర్లను..రెఫరెన్స్ సిటీగా మాత్రమే పరిగణించామని తెలిపింది.

ఇంధన ధరల వరకు మాత్రమే..
ఏ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలపై లెవీ, డ్యూటీ, సెస్ అధికంగా ఉందనే విషయాన్ని ప్రస్తావించినప్పుడు మూడో నంబర్ కాలమ్లో పొందుపరిచిన నగరాల పేర్లను రాజధాని సిటీ/రెఫరెన్స్ సిటీగా భావించాలని సూచించింది. పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించిన వివరాలను వెల్లడించే విషయంలో విశాఖపట్నాన్ని రెఫరెన్స్ సిటీగా మాత్రమే తాము భావించి- మూడో నంబర్ కాలమ్లో ఆ నగరం పేరును పొందుపరిచామని క్లారిటీ ఇచ్చింది.

హెచ్చార్సీ ఏర్పాటుతో మరింత జోరుగా ప్రచారం..
ఈ వివరణతో- విశాఖపట్నాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఏపీ పరిపాలన రాజధానిగా గుర్తించిందంటూ వచ్చిన వార్తలకు చెక్ పడినట్టే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా రాయలసీమ రీజియన్లోని కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించాలనేది జగన్ సర్కార్ భావిస్తోంది. జ్యుడీషియల్ అధికారాలను కలిగి ఉన్న మానవ హక్కుల కమిషన్ను కర్నూలుకు తరలించింది.
Recommended Video

ఈ ప్రచారానికి తెర దించినట్టే..
ఆ వెంటనే కేంద్ర ప్రభుత్వం కిందటి నెల 26వ తేదీన జారీ చేసిన ఈ అనెక్సర్ తాజాగా వెలుగులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్రం కూడా విశాఖకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఇక అక్కడికి తరలి వెళ్లడం మాత్రమే మిగిలి ఉందనే ప్రచారం జోరుగా సాగింది. ఈ ఏడాదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తారంటూ ఊహాగానాలు చెలరేగాయి. తాజాగా ఇచ్చిన వివరణతో ఆ తరహా ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం తెర వేసినట్టయిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications