ఇక ఆ పదవులకు ప్రత్యక్ష ఎన్నికే - ప్రభుత్వం కసరత్తు, సవరణ..!!
జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్..ఎంపీపీ పదవులకు ప్రత్యక్ష పద్దతిలో ఎన్నికల నిర్వహణపైన కేంద్రం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఈ పదవులకు పరోక్ష పద్దతిలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎన్నుకుంటున్నారు. ఇప్పుడు కేంద్రం దీనికి సంబంధించి మార్పులు చేస్తే సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఎటువంటి అభిప్రాయం చెబుతుందనేది కీలకంగా మారుతోంది.
ఈ రెండు పదవులకు ప్రత్యక్ష పద్దతిలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఉద్దేశించిన ఆర్టికల్ 243 (సీ)క్లాజ్ 5 (బీ)కి సవరణలు చేయాలని ఆలోచన చేస్తోంది. ఇందు కోసం అన్ని రాష్ట్రాల్లో పంచాయితీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం ఉండే అన్ని వర్గాల ప్రతినిధులతో చర్చించేందుకు వచ్చే నెల 4,5 తేదీల్లో హైదరాబాద్ లో జాతీయ స్థాయి వర్క్ షాప్ నిర్వహిస్తోంది. కేంద్రం ఈ దిశగా సవరణ చేసినా అమల్లోకి రావాలంటే సగానికి పైగా రాష్ట్రాలు అమోదం తెలపాలి. అన్ని దశల ప్రక్రియ పూర్తి చేయటానికి చాలా సమయం పడుతుందని భావిస్తున్నారు.

ఈ వర్క్ షాప్ లో పాల్గొని సూచనలు చేసేందుకు అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులను ఎంపిక చేసారు. ఏపీ నుంచి 9 మంది హాజరు కానున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మొత్తం 261 మంది పాల్గొంటున్నారు. ఏపీలో ప్రస్తుతం జెడ్పీ ఛైర్మన్, మండలాధ్యక్షులను పరోక్ష పద్దతిలో ఎన్నుకుంటున్నారు. 1995 కి ముందు కొంతకాలం ఉమ్మడి ఏపీలో ఈ పదవులకు ప్రత్యక్ష పద్దతిలోనే నేరుగా ప్రజలే ఎన్నుకొనే వారు. స్థానిక సంస్థలకు ప్రత్యేకాధికారాలు కల్పిస్తూ 1994లో కేంద్రం తీసుకొచ్చిన 73,74 రాజ్యాంగ సవరణల ద్వారా ఈ ఎన్నికల విధి విధానాల్లో మార్పులు చేసారు. దాని ప్రకారం పరోక్ష పద్దతిలో ఎన్నుకోవాలని నిర్దేశించారు.
గ్రామ పంచాయితీల్లో సర్పించి పదవులకు మాత్రం రాష్ట్రాల ఇష్టానుసారం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నుకోవచ్చని కేంద్రం ఆ సవరణల్లో పేర్కొంది. ఈ సవరణల మేరకు అన్ని రాష్ట్రాలు రాష్ట్ర స్థాయిలో కొత్త పంచాయితీరాజ్ చట్టాలను తీసుకొచ్చాయి. ఈ మేరకు ఏపీలో గ్రామపంచాయితీ సర్పించిని ప్రత్యక్ష విధానంలో, జెడ్పీ ఛైర్ పర్సన్, మండలాధ్యక్షులను పరోక్ష పద్దతిలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీల ద్వారా ఎన్నుకొనేలా 1995లొ కొత్త పంచాయితీ రాజ్ చట్టం అమల్లోకి వచ్చింది.












Click it and Unblock the Notifications