ఎన్నికల వేళ కేంద్రం కీలక ప్రకటన - పొత్తుల వేళ ఆ ఇద్దరికీ ఇరకాటంగా..!!
ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతోంది. బీజేపీతో జనసేన మిత్రపక్షంగా కొనసాగుతోంది. టీడీపీ సైతం బీజేపీతో జత కడుతుందనే ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో కేంద్రం ఏపీకి పునర్వభిజన చట్ట హామీల అమలు పైన మరోసారి స్పష్టత ఇచ్చింది. హామీలు ఒట్టి మాటలేనని తేల్చేసింది. దీంతో, ఇప్పుడు బీజేపీకి మిత్రపక్షంగా జనసేన డిఫెన్స్ లో పడుతోంది. టీడీపీ పొత్తుకు ముందుకు వస్తుందా. ఏపీ రాజకీయాల్లో ఈ వ్యవహారం కొత్త మలుపుకు కారణమవుతోంది.
కేంద్రం క్లారిటీ:ఏపీ పునర్విభజన చట్టం అమలు పై కేంద్రం తాజాగా పార్లమెంట్ లో ప్రకటన చేసింది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కుదరదని కేంద్రం తేల్చేసింది. సాంకేతికంగా-ఆర్థికంగా సాధ్యం కాదని తెలిపింది . సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకుని.. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రోడ్ మ్యాప్ రూపొందించడానికి జాయింట్ టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ గుర్తు చేశారు.

విశాఖలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు రూ.106.89 కోట్లను గతేడాది మంజూరు చేశామని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10 కోట్లు కేటాయించామని చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీ మేరకు దుగరాజుపట్నంలో మేజర్ పోర్టు ఏర్పాటు సాధ్యం కాదని తేల్చామని, దాంతో రామాయపట్నంలో మేజర్ పోర్టును అభివృద్ధి చేయాలని రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిందని చెప్పారు.
పదేళ్లు పూర్తవుతున్నా:పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న సంస్థల ఏర్పాటుకు కలిపి ఇప్పటివరకు రూ.21,154.568 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, అంశాలు, నిబంధనల అమలుపై సంబంధిత కేంద్ర శాఖల అధికారులు, రెండు రాష్ట్రాల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ఇప్పటి వరకు 31 సమీక్షలు నిర్వహించామని చెప్పారు.

చట్టంలోని అనేక అంశాలను అమలు చేశామని, మిగతావాటి అమలు వివిధ దశల్లో ఉందన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు, వివాదాలు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మాత్రమే పరిష్కారమవుతాయన్నది తమ అభిప్రాయమని తెలిపారు. పరస్పర అవగాహన, సర్దుబాట్లతో సామరస్యపూర్వకంగా వివాదాల పరిష్కారానికి కేంద్రం సంధానకర్తగా మాత్రమే వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
పొత్తుల వేళ ఇరకాటం:విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. జగన్ ను ఓడించేందుకు టీడీపీ, జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. ఎన్డీఏలో పవన్ భాగస్వామిగా ఉన్నారు. టీడీపీని తమతో కలుపుకొని వెళ్లే దిశగా పవన్ సంకేతాలు ఇస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా డిమాండ్ విషయంలోనే టీడీపీ నాడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు హోదా నినాదం అమలు కాలేదు. విభజన హామీలపైన కేంద్రం హామీలు ఒట్టి మాటలేనని తేలి పోయింది. ఈ సమయంలో తిరిగి బీజేపీతో జత కట్టటంతో రాజకీయంగా ఈ రెండు పార్టీలు ఇరకాటంలో పడతాయనే చర్చ మొదలైంది. వైసీపీ స్టాండ్ ఎలా ఉంటుందనేది మరింత ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications