జగన్ సర్కారుకు కేంద్రం మరో షాక్ - విజయవాడకు సోలార్ సిటీ... రాజధాని తరలింపు నేపథ్యం ?
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హవా కనిపించేది. నగరంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న బెంజి సర్కిల్, కనకదుర్గ ఫ్లై ఓవర్లు అప్పట్లో కేంద్రం సాయంతో ప్రారంభమైన నిర్మాణాలే. ఆ తర్వాత ఎన్డీయే నుంచి టీడీపీ బయటికొచ్చాక నత్తనడకన సాగిన ఈ ఫ్లై ఓవర్ల పనులు ఇప్పుడు చురుగ్గా పూర్తవుతున్నాయి. అదే సమయంలో కొత్త ప్రాజెక్టులూ విజయవాడను పలకరిస్తున్నాయి. ఓవైపు అమరావతి నుంచి రాజధాని తరలింపుకు జగన్ సర్కారు సిద్దమవుతున్న తరుణంలో ఇస్తే గిస్తే విశాఖకు ఇవ్వాల్సిన కొత్త ప్రాజెక్టులను కేంద్రం విజయవాడకు ఇవ్వడం వెనుక మర్మమేమిటన్న అనుమానాలు మొదలయ్యాయి.

కేంద్రం కరుణించాలే కానీ...
దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రంలోనూ ఆయా ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ది పథకాలకు కేంద్ర సాయం తప్పనిసరి. కేంద్రం సాయం లేకుండా కేంద్రం పరిధిలో ఉండే ఏ పథకం కూడా రాష్ట్రం దరిచేరదు. వాటి కోసం ఎంపీలు ఢిల్లీలో చేసే లాబీయింగ్ కూడా అలాగే ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్పుకోవాలంటే కేంద్రం సాయంతో గతంలో ఏపీలో రూపుదిద్దుకున్న పలు పథకాలు ఎన్డీయే నుంచి టీడీపీ బయటికొచ్చాక మూలనపడ్డాయి. తిరిగి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ పట్టాలెక్కాయి. అయితే అందులోనూ ప్రతీదీ వ్యూహాత్మకమే. ఇప్పుడు ఏపీలో రాజకీయంగా బలపడాలని కోరుకుంటున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు అర్ధమవుతోంది.

విజయవాడకు ప్రాజెక్టులు....
గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. విజయవాడకు రెండు కీలక ఫ్లైఓవర్ ప్రాజెక్టులను కేంద్రం కేటాయించింది. ఇందులో విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న కనకదుర్గ ఫ్లైవర్ తో పాటు విజయవాడ-కోల్ కతా జాతీయ రహదారిపై ఉన్న బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ కూడా ఉన్నాయి. ఈ రెండు ఫ్లైఓవర్లు పూర్తి చేయడానికి వాస్తవానికి రెండేళ్ల కంటే ఎక్కువ పట్టదు. కానీ అప్పట్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్ర్రారంభమైన ఈ రెండు ఫ్లైవర్ల పనులు నత్తనడకన సాగాయి. తాజాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెంజి సర్కిల్ ఫ్లైవర్ కు మోక్షం కలిగింది. 9 నెలలో కట్టి చూపిస్తామని అప్పటి టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు ఆరేళ్లయినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

కేంద్రం తాజా వరాలు...
ఈ ఫ్లైవర్ల విషయాన్ని పక్కనబెడితే గత ఆరు నెలలో కేంద్రం విజయవాడ కేంద్రంగా రెండు కొత్త ప్రాజెక్టులకు తెరలేపింది. ఇందులో విజయవాడ-ఖమ్మం హైస్పీడ్ రోడ్ కారిడార్ ఒకటి కాగా... సోలార్ సిటీ ప్రాజెక్టు మరొకటి. గతంలో వీటిపై ప్రతిపాదనలు ఉన్నప్పటికీ వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక మాత్రమే కేంద్రం మరోసారి వీటిని తెరపైకి తెచ్చింది. ఇందులో విజయవాడ-ఖమ్మం రహదారి పనులకు భూసర్వే కొనసాగుతుండగా... సోలార్ సిటీ ప్రాజెక్టుపై తాజాగా ప్రకటన వచ్చింది. విజయవాడలోని అన్ని ఇళ్లకూ సోలార్ పలకలు పెట్టుకునేందుకు 40 శాతం రాయితీతో కేంద్రం ఓ ప్రాజెక్టును ప్రతిపాదించింది. సోలార్ పవర్ కిలోవాట్ కావాలంటే రూ.40 వేలతో సామాగ్రి ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో కేంద్రం 40 శాతం రాయితీ ఇస్తుంది. త్వరలో దీన్ని కమర్షియల్ కనెక్షన్లకూ వర్తింపచేస్తారు.

రాజధాని తరలింపు వేళ...
ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. కాస్త సమయం పట్టినా ప్రస్తుత రాజకీయ పరిస్ధితులు, ఇతరత్రా కారణాలను బట్టి చూసినా తరలింపు ఖాయంగానే కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో కేంద్రం వరుసగా విజయవాడకు ప్రాజెక్టులు ప్రకటించడం చర్చనీయాంశంగా మారుతోంది. అదే సమయంలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా జగన్ సర్కారు మాత్రం విజయవాడలో చెప్పుకోదగిన ప్రాజెక్టు ఏదీ ప్రకటించలేదు. టీడీపీ ఎంపీగా కేశినేని నాని ఉండటం, రాజధాని తరలింపు నేపథ్యంలో నగరంలో ఉన్న వ్యతిరేకత దృష్ట్యా ఇప్పట్లో జగన్ సర్కారు విజయవాడపై దృష్టిపెట్టే పరిస్ధితి లేదు. అదే సమయంలో కేంద్రం ఈ గ్యాప్ ను సొమ్ము చేసుకుంటూ ప్రకటిస్తున్న పథకాలు ఆసక్తి రేపుతున్నాయి.
Recommended Video

బెజవాడపై బీజేపీ వ్యూహాలు...
ప్రస్తుతానికి విజయవాడలో బీజేపీ పరిస్ధితి దారుణంగా ఉంది. గతంలో రాజధానిగా ఉండగా కూడా ఇక్కడ కార్పోరేటర్ ను సైతం గెలిపించుకోలేని పరిస్ధితి బీజేపీది. ఎంపీగా పోటీ చేసినా లక్ష ఓట్లు కూడా తెచ్చుకోలేని దుస్ధితి. దీంతో ఆర్ధిక నగరంగా ఉన్న విజయవాడపై సీరియస్ గా దృష్టిపెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు వైసీపీ విశాఖకు రాజధాని మకాం మార్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో స్ధానికంగా అధికార పార్టీపై నెలకొన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు బీజేపీ రంగంలోకి దిగవచ్చని తెలుస్తోంది. అందుకే ముందుగా కొన్ని కీలక ప్రాజెక్టులను ప్రకటించి ఆ తర్వాత సుజనా చౌదరి వంటి సామాజిక వర్గ నేతలను తెరపైకి తీసుకొచ్చి వైసీపీ ప్రభావం లేని బెజవాడ రాజకీయాలను తమకు అనుకూలంగా మలుచుకోవచ్చని ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే బీజేపీతో సఖ్యతగా ఉంటున్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నుంచి కూడా ఇందుకు అభ్యంతరాలు ఉండకపోవచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications