సీఎం జగన్ వినతిని అంగీకరించిన కేంద్రం: సీఎస్ గా దాస్ పొడిగింపు : అడ్డుకొనే ప్రయత్నం చేసినా ..!!
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాద్ దాస్ పదవీ కాలం పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. నీలం సాహ్ని గత డిసెంబర్ 31న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసారు. ఆ స్థానంలో అప్పటి వరకు ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న 1987 బ్యాచ్ కు ఐఏఎస్ అధికారి ఆదిత్య నాద్ దాస్ ను ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అయితే, ఈ నెలాఖరుతో దాస్ పదవీ కాలం ముగియనుంది. దీంతో...ఆయన పదవీ కాలం మరో మూడు నెలల పాటు పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్ మే 17వ తేదీన ప్రధానికి లేఖ రాసారు.
Recommended Video
దీనిని పరిశీలించిన తరువాత దాస్ పదవీ కాలం మూడు నెలల పాటు పొడిగిస్తూ ప్రధాని ఆమోదించారు. దీంతో..వెంటనే కేంద్రంలోని సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా దాస్ సెప్టెంబర్ 30వ తేదీ వరకు పదవిలో కొనసాగనున్నారు. ఇప్పటికే కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఏపీ కేడర్ కు చెందిన శమీర్ శర్మను తిరిగి ఏపీకి కేటాయించారు. దీంతో...నూతన సీఎస్ గా ఆయనకు అవకాశం దక్కుతుందనే ప్రచారం సాగింది. కానీ, ఇప్పుడు దాస్ పదవీ కాలం పొడిగించటంతో తిరిగి సెప్టెంబర్ 30వ తేదీ నాటికి కొత్త సీఎస్ కోసం పోటీ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
1988 బ్యాచ్ కు చెందిన ఒక సీనియర్ అధికారి ఢిల్లీ కేంద్రం గా ఏపీ సీఎస్ అయ్యేందుకు ప్రయత్నాలు చేసారని విశ్వసనీయ సమాచారం. ప్రధాని సైతం దాస్ పదవీ కాలం పొడిగింపుకు వెంటనే ఆమోదం ఇవ్వకపోవటంతో ముఖ్యమంత్రి వినతికి ఆమోదం లభిస్తుందా లేదా అనే సంశయం ప్రభుత్వ వర్గాల్లో కనిపించింది.
ఇక, ఇప్పుడు దాస్ తన పదవిలో కంటిన్యూ కానున్నారు. సీఎం జగన్ గతంలో నీలం సాహ్ని పదవీ కాలం సైతం రెండు సార్లు పొడిగించగా...ఇప్పుడు దాస్ పదవీ కాలం తొలి విడతగా మూడు నెలల పాటు పొడిగించేందుకు అంగీకరించారు. దాస్ గతంలో జగన్ పైన సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఉన్నారు. ఇక, 1988 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ లు దాస్ తరువాత సీఎస్ పదవి కోసం పోటీ పడుతున్నారు.