ఏపీకి ఇచ్చిన హామీల అమలుకు కేంద్రం డెడ్ లైన్- ఆ లోగా అవన్నీ పూర్తి చేస్తామని ప్రకటన
2014లో ఏపీ విభజన సందర్భంగా కేంద్రం రాజ్యసభలో పలు హామీలు ఇచ్చింది. ఇన్ని హామీలు ఇస్తున్నాం కాబట్టి రాష్ట్ర విభజనకు ఒప్పుకోవాలని కోరింది. అయితే అప్పటి పరిస్ధితులకు అనుగుణంగా ఏపీ ప్రజలు ఒప్పుకోకపోయినా విభజన మాత్రం జరిగిపోయింది. అయితే ఆ హామీలు కూడా ఇప్పటికీ అమలు జరగలేదు. దీంతో రాష్ట్ర ప్రజల్లో అసహనం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ పార్లమెంటులో కీలక ప్రకటన చేసింది.
ఏపీకి అప్పట్లో ఇచ్చిన విభజన హామీల అమలుకు కేంద్రం పదేళ్ల డెడ్ లైన్ పెట్టుకుంది. పదేళ్లలో ఈ హామీలు నెరవేరుస్తామని చెప్పింది. అయితే ఇందులో ఇప్పటికే ఏడేళ్లు పూర్తయిపోయాయి. ఇక మిగిలింది మూడేళ్లు మాత్రమే. ఇందులో కీలకమైన ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి, మరికొన్ని హామీలు నెరవేర్చాల్సి ఉంది. దీనిపై ఇన్నాళ్లూ మౌనంగా ఉండిపోతున్న కేంద్రం.. తాజాగా క్లారిటీ ఇచ్చింది. పార్లమెంటులో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ క్లారిటీ ఇచ్చింది.
విభజన హామీల అమలుకు పదేళ్ల గడువు ఉందని కేంద్రం ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఇందులో ఏడేళ్లు పూర్తయ్యాయని, అయితే ఇప్పటికే 25సార్లు సమీక్షలు నిర్వహించి కొన్ని హామీలు అమలు చేసినట్లు పేర్కొంది. రాబోయే మూడేళ్లలో మిగతా హామీలు అమలు చేస్తామని కేంద్రం తెలిపింది. కేంద్రం విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు 2024 వరకూ గడువుంది. దీంతో ఆ లోగా ఈ హామీలు అమలు చేస్తామని వెల్లడించింది. అయితే ఇప్పటికే కీలకమైన ప్రత్యేక హోదాతో పాటు మిగతా హామీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్రం.. రాబోయే మూడేళ్లలో ఈ హామీలు అమలు చేస్తుందన్న దానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.