వైజాగ్ స్టీల్ ప్లాంట్కు మరో ఝలక్- 1540 కోట్ల భూముల అమ్మకం- ఎన్బీసీసీతో ఒప్పందం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. కార్మిక సంఘాల పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర బంద్ కూడా జరుగుతోంది. ఇలాంటి తరుణంలో జాతీయ భవన నిర్మాణ కార్పోరేషన్ ఎన్బీసీసీ చేసిన ఓ ప్రకటన ఉద్యమకారుల్లో ఆగ్రహావేశాలు నింపుతోంది. ప్రైవేటీకరణలో భాగంగా స్టీల్ ప్లాంట్కు చెందిన రూ.1540 కోట్ల విలువైన భూముల అభివృద్ధి, అమ్మకం కోసం కేంద్ర ప్రభుత్వంతో తాము అవగాహనా ఒప్పందం చేసుకున్నట్లు ఎన్బీసీసీ చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపుతోంది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వేగవంతం
నష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనివార్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్న కేంద్రం ఇక ఏ మాత్రం సంకోచించకుండా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే స్టీల్ ప్లాంట్ విలువ పెంచేందుకు వీలుగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఓవైపు ప్రైవేట్ బిడ్గింగ్కు అవసరమైన సాంకేతిక వివరాలను ఇవ్వాలని ఇప్పటికే అధికారులను అడిగిన కేంద్రం.. ఆ లోపు మిగతా కార్యక్రమాలను పూర్తి చేయాలని భావిస్తోంది. దీంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ వచ్చే ఏడాది కల్లా పూర్తి కావడం ఖాయంగా కనిపిస్తోంది.

రూ.1540 కోట్ల భూముల అమ్మకానికి రెడీ
స్టీల్ ప్లాంట్కు వివిధ ప్రాంతాల్లో వేల ఎకరాల భూములు ఉన్నాయి. నేరుగా ప్లాంట్ ఉన్న ప్రాంతంలోనే 6 వేల ఎకరాలకు పైగా దాతలు ఇచ్చిన భూమి ఉంది. దీంతో పాటు ఉద్యోగుల క్వార్టర్స్, అనుబంధ భవనాల రూపంలో పలు చోట్ల భూములు ఉన్నాయి. వీటిలో నగరంలోని మద్దెలపాలెం, సీతమ్మధార ప్రాంతాలకు చేరువలో 22.19 ఎకరాల భూమి ఉంది. ఇందులో ప్రస్తుతం ఉద్యోగుల క్వార్ట్రర్స్ ఉన్నాయి. దీన్ని అభివృద్ధి చేసి ప్రైవేటీకరణలో భాగంగా చేపట్టే ప్లాంట్ విక్రయంలో చేర్చాలని కేంద్రం యోచిస్తోంది. దీని విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.1540 కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా.

ఫిబ్రవరి 26న ఎన్బీసీసీతో కేంద్రం ఒప్పందం
విశాఖ నగరంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల క్వార్టర్స్ భూమిని అభివృద్ధి చేసి తర్వాత విక్రయించేలా గత నెల 26నే కేంద్ర ప్రభుత్వం- జాతీయ భవన నిర్మాణ కార్పోరేషన్ (ఎన్బీసీసీ) మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్రం తరఫున స్టీల్ ప్లాంట్ అధికారులు ఈ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలను ఎన్బీసీసీ తాజాగా బయటపెట్టింది. గతంలో 830 క్వార్టర్లను ఇక్కడ ఉద్యోగుల కోసం నిర్మించారు. అయితే వీటిలో చాలా మటుకు శిధిలం అయ్యాయి. ఇందులో 130 క్వార్టర్లను రిపేర్లు చేయించుకుని ఉద్యోగులు ఉంటున్నారు. వీటిని పూర్తిగా పడగొట్టేసి కమర్షియల్ కాంప్లెక్స్తో పాటు నివాసాలు కూడా నిర్మించేందుకు ఎన్బీసీసీ ఒప్పందం చేసుకుంది.

స్టీల్ ప్లాంట్ ఆందోళనలన్నీ వృధా
విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. కార్మిక సంఘాల పిలుపు మేరకు ఇవాళ జరుగుతున్న రాష్ట్ర బంద్లో బీజేపీ మినహా మిగిలిన రాజకీయ పార్టీలన్నీ పాల్గొంటున్నాయి. అయితే ఇవేవీ పట్టించుకునే పరిస్ధితుల్లో కేంద్రం లేదు. దీంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) అధికారులు వేగంగా పావులు కదుపుతున్నారు. ఈ ప్రక్రియ ఆలస్యమైతే ఆందోళనలు మరింత ఉధృతం కావొచ్చని కేంద్రం ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఏడాది లోపు ప్రైవేటీకరణ పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని అందుకునేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు.












Click it and Unblock the Notifications