హైదరాబాద్పై డిగ్గీ మెలిక: టిపై బాబు, జగన్లకు విజ్ఢప్తి
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాదు పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, ఈ పదేళ్లలో హైదరాబాదు పైన అధికారం గవర్నర్కు లేదంటే కేంద్రం చేతిలో ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఆదివారం దిగ్గీ స్పందించారు. విభజన అంశం రెండుసార్లు శాసన సభకు వెళ్తుందని చెప్పారు. తొలుత ముసాయిదా తీర్మానం, ఆ తర్వాత బిల్లు ముసాయిదా సభకు వెళ్తాయన్నారు.
రాబోయే పదేళ్ల పాటు హైదరాబాద్ సంయుక్త రాజధానిగా ఉంటుందని, ఈ పదేళ్లలో హైదరాబాద్ పాలన గవర్నర్ లేదా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందని తెలిపారు. అదే సమయంలో హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం మాత్రం కాబోదని స్పష్టం చేశారు. ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలు, భూపరిపాలన, రెవెన్యూ వంటి కీలక విభాగాలను కేంద్రమే పర్యవేక్షిస్తుందని ఇది వరకే వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.
డిగ్గీ మొదటిసారిగా ఈ విషయాన్ని ద్రువీకరించారు. అయితే, గవర్నర్ లేదా కేంద్ర ప్రభుత్వ పరిపాలనలోకి ఏయే అంశాలను తీసుకొస్తారనే అంశంపై మంత్రుల బృందం ఏర్పాటై, సిఫారసులు అందిస్తేగానీ స్పష్టత రాదు. విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లను నియమించవచ్చు. లేదా రెండు రాష్ట్రాలకు ఒకే గవర్నర్ కూడా ఉండవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో 'అడ్డదారులు' (షార్ట్కట్స్) లేవని... చట్టాలు, రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటామని దిగ్విజయ్ తెలిపారు.
విభజన విషయంలో రాష్ట్ర శాసనసభను అతిక్రమించమని, చట్టాన్ని, రాజ్యాంగ సూత్రాలను పాటిస్తామని, విభజనపై ముసాయిదా బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి వెళ్తుందని, శాసనసభలో దీనిపై చర్చ జరుగుతుందని వివరించారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి తిరిగి రాగానే ముసాయిదా బిల్లును ఆయనే అసెంబ్లీకి పంపిస్తారని చెప్పారు. విభజనపై ఏర్పాటు చేయబోయే మంత్రివర్గ బృందం సహజంగా రాష్ట్రానికి వెళ్లదని, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రతినిధుల నుంచి సలహాలు మాత్రం స్వీకరిస్తుందని వెల్లడించారు.
హైదరాబాద్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ పూర్తి భద్రత కల్పిస్తామని దిగ్విజయ్ సింగ్ భరోసా ఇచ్చారు. విద్యార్థులు, ఉద్యోగుల సమస్యలకు కూడా పరిష్కారం కనుగొంటామని చెప్పారు. సీమాంధ్ర ప్రజలు హైదరాబాద్లో ఉన్నా, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఎక్కడ ఓటర్లుగా నమోదైతే అక్కడి పౌరులు అవుతారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటును సమర్థిస్తూ లేఖలు ఇచ్చిన తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఇప్పుడు తీరు మార్చుకోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని దిగ్విజయ్ పేర్కొన్నారు. గతంలో చేసిన హామీల నుంచి వెనక్కి పోవద్దని బాబు, జగన్లను కోరారు.