కరోనా తర్వాత స్కూళ్లపై ఆంక్షలు- సిద్ధం చేస్తున్న కేంద్రం-త్వరలో ప్రకటన
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుతోంది. గతంతో పోలిస్తే కోవిడ్ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ కేసులున్నా మిగిలిన చోట్ల మాత్రం స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. దీంతో కోవిడ్ తర్వాత తిరిగి స్కూళ్లు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది. వీటిని త్వరలోనే రాష్ట్రాలకు పంపనుంది.
కోవిడ్ తగ్గాక దేశవ్యాప్తంగా పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను రూపొందిస్తోంది. వీటి ప్రకారం ఆంక్షలతో తిరిగి స్కూళ్లు తెరిచేందుకు అనుమతించబోతోంది. ప్రస్తుతం చాలా వరకూ స్కూళ్లు ఆన్ లైన్ విధానంలోనే నడుస్తున్నాయి. వీటిని త్వరలో సాధారణ పద్ధతిలో పునఃప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం.. అందుకు అనుగుణంగా నిబంధనలు సిద్దం చేస్తోంది. ఇందుకోసం నిపుణులతో సంప్రదింపులు కూడా జరుపుతోంది. రెండేళ్లుగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది పిల్లలు స్కూళ్లకు దూరం కావడంతో స్కూళ్లను గతంలోలా తిరిగి నిర్వహించాలనే ఒత్తిడి పెరుగుతోంది. దీంతో కేంద్రం ఈ దిశగా మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది.
ఇందుకోసం విద్యా, వైద్య రంగాలకు చెందిన నిపుణులతో కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సిద్దం చేసి రాష్ట్రాలకు పంపబోతోంది. కోవిడ్ తగ్గాక స్కూళ్లను పునఃప్రారంభించాలనే యాజమాన్యాలకు ఈ ఆంక్షలను తప్పనిసరి చేసేలా ఈ మార్గదర్శకాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితంగా పాటించాలని కేంద్రం కోరబోతోంది. కోవిడ్ ఫస్ట్ వేవ్ కారణంగా 2020 మార్చిలో తొలిసారి స్కూళ్లు పూర్తిస్దాయిలో మూతపడ్డాయి. ఆ తర్వాత తిరిగి ఇప్పటికీ యథాతథ స్ధితికి చేరుకోలేదు. దీనికి ప్రధాన కారణం కేంద్రం విధించిన ఆంక్షలే. ఇప్పుడు వాటిని తొలగించి రెగ్యులర్ గా స్కూళ్లు నడిపేందుకు మార్గదర్శకాలు ప్రకటించాలని కేంద్రం భావిస్తోంది.