కేంద్రం యూటర్న్: పది జిల్లాల తెలంగాణే ఫైనల్
న్యూఢిల్లీ: తెలంగాణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. 12 జిల్లాలతో కూడిన రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను విరమించుకుని పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకే మొగ్గు చూపుతోంది. ఈ మేరకు ఎన్డీటివీ ఓ వార్తాకథనాన్ని ఇచ్చింది. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిపి 12 జిల్లాల తెలంగాణను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగానే కసరత్తు చేసింది.
అయితే, రాయల తెలంగాణకు ఇతర పార్టీల నాయకుల నుంచే కాకుండా కాంగ్రెసు పార్టీ నాయకుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. రాయల తెలంగాణ ప్రతిపాదనపై తెలంగాణలోని పది జిల్లాల్లో గురువారం బంద్ జరిగింది. బుధవారం నిరసన ర్యాలీలు జరిగాయి. గురువారం ఉదయం నుంచి తెలంగాణ కాంగ్రెసు నాయకులు రాయల తెలంగాణ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కోరుతూ లాబీయింగ్ చేశారు.
రాయల తెలంగాణ ప్రతిపాదనపై నోట్ తయారు చేసి జివోఎం కేబినెట్ ముందు ఉంచాలని అనుకుంది. అయితే, మంత్రి వర్గ సమావేశం జరగడానికి ముందు తన ప్రతిపాదనను మార్చి, పది జిల్లాలతో కూడిన కేబినెట్ నోట్ను రూపొందించారు. దీనిపై కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేష్ గురువారంనాడు కసరత్తు చేశారు.
పది జిల్లాల తెలంగాణకు మాత్రమే తాము మద్దతు ఇస్తామని బిజెపితో పాటు మిత్రపక్షం ఆర్ఎల్డి కూడా స్పష్టం చేసింది. రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తెస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) బిజెపి వైపు మొగ్గు చూపే అవకాశం ఉండడం కూడా కాంగ్రెసు అధిష్టానాన్ని పునరాలోచనలో పడేసినట్లు తెలుస్తోంది.