పార్లమెంట్ లో మరోసారి ఏపీ-తెలంగాణ ప్రస్తావన-ఆస్తుల విభజన కుదరట్లేదన్న కేంద్రం
ఏపీ, తెలంగాణ విభజన వ్యవహారం మరోసారి పార్లమెంట్ లో చర్చకు వచ్చింది. నిన్న ప్రధాని మోడీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ఏపీ, తెలంగాణ విభజన సరిగ్గా జరగలేదంటూ సెటైర్లు వేశారు. ఇందుకు కాంగ్రెస్ నే కారణంగా నిందించారు. ఇవాళ మరోసారి అదే అంశంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ సమాధానమిచ్చారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజన పూర్తయినా ఇప్పటికీ ఆస్తుల విభజన ప్రక్రియ మాత్రం పూర్తి కాలేదు. దీనికి పలు కీలక కారణాలున్నాయి. అయితే ఆస్తుల విభజన పూర్తి కాకపోవడంతో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికీ ఏపీకి చెందిన పలు ఆస్తులు హైదరాబాద్ లో ఉండిపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ఇదే అంశంపై రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆస్తుల విభజన ఎప్పటికల్లా పూర్తవుతుందనే అంశంపై ఆయన వేసిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ స్పందించారు. ఆస్తుల విభజనపై సయోధ్య కుదరట్లేదని ఈ సందర్భంగా నిత్యానందరాయ్ తెలిపారు.

ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల పంపకం ఇంకా పూర్తి కాలేదని నిత్యానందరాయ్ రాజ్యసభలో వెల్లడించారు. ఏపీ, తెలంగాణ మధ్య కొన్ని ఆస్తుల విభజనపై సయోధ్య కుదరట్లేదని ఆయన తెలిపారు. ఏకాభిప్రాయంతోనే ఆస్తుల విభజన జరుగుతుందని ఆయన పేర్కొన్నారు ఇందుకోసం ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య 26 సమావేశాలు నిర్వహించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు నిత్యానందరాయ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.












Click it and Unblock the Notifications