రాజధాని సహా: బాబుకు వెంకయ్య హామీ, 'సమైక్య ఏపీ'తో రాహుల్కు కౌంటర్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బుధవారం హామీ ఇచ్చారు. చంద్రబాబు సింగపూర్ పర్యటన ముగించుకొని మంగళవారం ఢిల్లీ వచ్చారు.
చంద్రబాబు బుధవారం ఉదయం కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నివాసానికి వెళ్లారు. వెంకయ్యనాయుడు ఆహ్వానం మేరకు చంద్రబాబు అల్పాహార విందుకు ఆయన హాజరయ్యారు. వెంకయ్య, చంద్రబాబులు పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వెంకయ్య విలేకరులతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్సిటీలుగా ఎంపికైన మూడు నగరాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. విజయవాడ మెట్రోకు కేంద్రం ఇప్పటికే సుముఖత తెలిపిందన్నారు. చంద్రబాబు తన సింగపూర్ పర్యటన వివరాలు తనతో పంచుకున్నట్లు వెంకయ్య తెలిపారు.
కాగా, చంద్రబాబు నాయుడు బుధవారం పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, రాధామోహన్ సింగ్, అశోక గజపతి రాజులతో సమావేశం కానున్నారు. విభజన హామీల అమలు పైన వారితో చర్చిస్తారు.
ఏపీలో ఐదు లక్షల ఎకరాలు సేకరించారు: రాహుల్కు వెంకయ్య కౌంటర్
భూసేకరణ చట్టంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వెంకయ్య మంగళవారం అన్నారు. వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసినట్లుగా ఉందన్నారు.
కాంగ్రెస్ పాలనలో లక్షల ఎకరాల భూములను సేకరించారన్నారు. నాలుగింతల పరిహారం, సామాజిక ప్రభావ అంచనాలు లేకుండానే భూములను ఎలా తీసుకున్నారో ఉదాహరణలతో ఇదివరకే మేం చెప్పామని, మెరుగైన చట్టాన్ని మా ప్రభుత్వం తీసుకు వస్తుంటే ప్రజల్ని రాహుల్ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
ఉమ్మడి ఏపీలో 2004-2014 మధ్య 5 లక్షలకు పైగా ఎకరాలను బలవంతంగా సేకరించారని వెంకయ్య... రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు. హర్యానాలో ఎనభై వేల ఎకరాలు సేకరించారన్నారు. తాము వాస్తవాలు చెబుతామని, వాటికి సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.