'టీటీడీ బోర్డు ఏర్పాటు వార్తలన్నీ ఊహాజనితాలే'
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నియామకంపై గత పది నెలలుగా ఊగిసలాడుతున్న సందిగ్థతకు ఎట్టకేలకు ఏపీ సీఎం చంద్రబాబు తెరదించినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారమే తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తిని పాలక మండలి చైర్మన్గా నియమించారని స్ధానిక మీడియాలో వార్తలు వచ్చాయి.
తిరుపరి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి నేతృత్వంలో 16 మందితో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఏర్పాటైనట్లు శనివారం మధ్యాహ్నాం నుంచి వార్తలు వచ్చాయి. అయితే సభ్యుల కూర్పులో సమతౌల్యం కుదరక ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనకు కొంత విరామం ఇచ్చినట్లు తెలిసింది.
మొత్తం 18 సభ్యులతో టీటీడీ బోర్డును ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి. వీరిలో తెలంగాణకు చెందిన ముగ్గురికి, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రకు చెందిన ఒక్కొక్కరికి అవకాశం దక్కిందని వచ్చినా, ఈ బోర్డు నియామకానికి సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
తెలంగాణ నుంచి ఎమ్మెల్యేలు సాయన్న, సండ్ర వెంకట వీరయ్య, బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిల పేర్లు బలంగా వినిపించాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు కొండెపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి, కోళ్ల లలితకుమారి, పిల్లి అనంత లక్ష్మి, రాఘవేంద్రరావులతో కలిపి 18మందికి పాలక మండలి సభ్యులుగా అవకాశం కల్పించినట్లు వార్తలు వచ్చాయి.
అయితే, శనివారం రాత్రికల్లా దీనిపై జీవో విడుదలవుతుందని ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. సీఎం అనంతపురం జిల్లా పర్యటనలో ఉండటం, అక్కడినుంచి ఢిల్లీ వెళ్లిపోవడంతో మిగతా సభ్యుల నియామకంపై పూర్తిస్ధాయి కసరత్తు చేయలేదని అధికార వర్గాల వెల్లడించాయి.
ఈనెల 17న ముఖ్యమంత్రి చైనా పర్యటన నుంచి వచ్చిన తర్వాతే తుది ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక టీటీడీ బోర్డు కూర్పు గురించి మీడియాలో వచ్చిన వార్తలను ప్రభుత్వం శనివారం ఖండించింది. 'దీనిపై మీడియాలో వచ్చిన వార్తలన్నీ ఊహాజనితాలే'నని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.