మోడీ కాళ్ల వద్ద తాకట్టు: చలసాని శ్రీనివాస్, సోము వీర్రాజుపై తీవ్ర వ్యాఖ్య
గుంటూరు: బిజెపి రాష్ట్ర నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్షాల మెప్పు పొందేందుకు రాష్ట్రాన్ని వారి కాళ్ల వద్ద తాకట్టుపెట్టవద్దని ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ విమర్శించారు. ప్రత్యేక హోదా సాధనకు సిపిఐ చేపట్టిన బస్సు యాత్ర బుధవారం గుంటూరు చేరింది.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. బిజెపి నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మంగళవారం చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. పార్లమెంట్లో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీలను అభినందిస్తున్నామని సిపిఐ రాష్ట్ర శాఖ కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
అదే రీతిలో బీజేపీ, టీడీపీ ఎంపీలు కూడా పోరాడితే గంటలో ప్రత్యేక హోదా వస్తుందన్నారు. కాంగ్రెస్ విభజన చేసిన తరువాతే ఎన్నికలు జరిగాయని, ఆ ఎన్నికల్లోనే ఎన్డీఏ ఇచ్చిన హామీలను నెరవేర్చమంటున్నామని ఆయన అన్నారు.
రాష్ట్రానికి యోగా కన్నా ప్రత్యేక హోదా ముఖ్యమన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయలేక లోటు బడ్జెట్తో రాష్ట్రం సతమతమవుతుంటే బీజేపీ నాయకులకు రాష్ట్రం ఎంతో బాగున్నట్లు కనబడుతుందని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారం శివాజి అన్నారు. ఈనెల 10వ తేదీలోపు ప్రత్యేక హోదాపై ప్రకటన రాకపోతే 11న చేసే బంద్కు అన్ని పక్షాలు కలిసి రావాలన్నారు.
కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జునరావు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మస్తాన్వలి, నవనేతం సాంబశివరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, లంకా మాధవి, గద్దె తిరుపతిరావు, డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.