'జగన్-బాబులు తిట్టుకోవడానికే': పురంధేశ్వరీ! చంద్రబాబుపై ఆపు: కాంగ్రెస్ నేత
హైదరాబాద్: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. జగన్, చంద్రబాబులు తిట్టుకోవడానికే సమయం సరిపోతుందని, ఇక వాళ్లు బీజేపీని ప్రత్యేక హోదా కోసం ఎక్కడ నిలదీస్తారని ప్రశ్నించారు.
కేసీఆర్ చెప్పింది నిజమే కదా: ఏపీ-తెలంగాణపై నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్
విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము హామీల సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకూ పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.
తిట్టుకోవడానికే వారి టైం సరిపోతుంది
చంద్రబాబు, జగన్లు నిత్యం పరస్పరం తిట్టుకోవడమే సరిపోతుంది తప్ప, ఈ విషయమై ప్రధాని మోడీని, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాని నిలదీయడం లేదని చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తారంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు.
మోడీ ఇంటిని ముట్టడించాలి
ప్రత్యేక హోదాపై పార్లమెంట్ను స్తంభింపజేయాలని ఆయన టీడీపీ, వైసీపీలను డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఈ విషయమై కేంద్రాన్ని నిలదీయాలన్నారు. అవసరమైతే ప్రధాని మోడీ ఇంటిని ముట్టడించాలని, ప్రత్యేక హోదా పైన రాజకీయ నేతలను నిలదీయాలన్నారు.
బాబును విమర్శించడం తప్ప, బీజేపీ నేతలపై ఏపీసీసీ నేత
మరోవైపు, ఏపీ బీజేపీ నేతలపై ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ నిప్పులు చెరిగారు. విభజన చట్టం హామీల అమలు విషయంలో ఏపీపై కేంద్రం వివక్ష చూపుతున్నప్పటికీ అంతా సవ్యంగా ఉందంటూ రాష్ట్ర బీజేపీ నాయకులు వితండవాదన చేస్తున్నారంటూ మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వంటి నాయకులు పదేపదే చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శించడం తప్పా, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రధాని మోడీ ఎదుట నోరు మెదపటం లేదన్నారు.
రాష్ట్ర అధ్యక్ష పదవి కోసమే ఇలా
సోము వీర్రాజు తీరు చూస్తుంటే ఏపీ బీజేపీ శాఖకు అధ్యక్షుడు అయ్యేందుకు, తమ అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు మీడియా ఎదుట అవాకులు చెవాకులు పేలుతున్నట్లుగా ఉందని, రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చుకోవడంపై ఆయన చిత్తశుద్ధి చూపడం లేదని శివాజీ అన్నారు.
పురంధేశ్వరి వంటి వారు బాబును విమర్శించడం మాని..
దగ్గుబాటి పురంధేశ్వరి, కావూరి సాంబశివ రావు, కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు మొదట చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకొని, విభజన చట్టం హామీలను నెరవేర్చేందుకు ప్రధాని మోడీపై ఒత్తిడి తీసుకురావాలని శివాజీ డిమాండ్ చేశారు. ఏపీకి జరుగుతున్న అన్యాయానికి బీజేపీ, టీడీపీ రెండూ కారణమే అన్నారు. విభజన చట్టంలో హామీలను అమలు చేయకుండా ఎన్ని గిమ్మిక్కులు చేసినా ఏపీలో బీజేపీ బలపడదన్నారు.