'హోదా అడిగితే జైలుకా!..; తొక్కుతామంటే లేచి మరీ పోరాడతాం..'
హోదా పోరాటాన్ని తొక్కుతామంటే లేచి మరీ పోరాడతామని ప్రత్యేకహోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు.
హైదరాబాద్: ఆర్కే బీచ్ వేదికగా ప్రత్యేక హోదా ఉద్యమం ఉధృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో.. ఏపీలో పరిస్థితి క్షణ క్షణం ఉత్కంఠను తలపిస్తోంది. టీడీపీ నేతల అభిప్రాయాలు, పవన్ ట్వీట్లతో హోదా రాజకీయం వేడెక్కుతోంది.
ప్రత్యేకహోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తాజాగా దీనిపై స్పందించారు. ఏపీ యువతతో కలిసి రేపు ఆర్కే బీచ్ లో తమ పోరాటాన్ని నిర్వహించి తీరుతామని చలసాని శ్రీనివాస్ తేల్చి చెప్పారు. హోదా పోరాటాన్ని తొక్కుతామంటే లేచి మరీ పోరాడతామన్నారు.
ప్యాకేజీ కన్నా రాష్ట్రానికి ఎంతో మేలు చేసే ప్రత్యేక హోదానే ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని చలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాల కోసమే తమ పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. అనుమతిచ్చేది లేదంటూ పోలీసులు చేస్తోన్న వ్యాఖ్యలపై చలసాని కొట్టిపారేశారు. నిరసనలు తెలిపేవారిని అరెస్టు చేస్తామంటే బెదిరేది లేదని తెగేసి చెప్పారు.

హోదా అడిగితే జైలుకా?:
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అడగటమే ప్రభుత్వం దృష్టిలో నేరమైపోయిందన్నారు మాజీ వడ్డే శోభనాద్రీశ్వరరావు. 'ప్రజాస్వామ్య నిరసనలపై ప్రభుత్వ నిర్బంధం-హోదా' అనే అంశంపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
నిరసనకారులను బెదిరించేలా డీజీపీ సాంబశివరావు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు శోభనాద్రీశ్వరరావు. డీజీపీ వ్యాఖ్యలు దారుణమన్నారు. నిర్బంధాలతో చంద్రబాబు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారని ఇదే సమావేశంలో మాట్లాడిన సీపీఎం నేత మధు మండిపడ్డారు.
హోదాపై గళమెత్తితే జైలుకు పంపిస్తామనడం సరికాదని సీపీఐ రామకృష్ణ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications