ఛలో రాజ్ భవన్.. విద్యార్ధి సంఘాల ముట్టడి ఉద్రిక్తం: కొనసాగుతున్న అరెస్టులు; 144సెక్షన్ విధింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్ భవన్ ను ముట్టడించడానికి రాయలసీమ విద్యార్థి సంఘాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆనందరావు ను రీకాల్ చేయాలని, 153 మంది విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు రాజ్ భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాల నేతలు ప్రయత్నించారు.
విజయవాడలోని గాంధీనగర్ అలంకార్ సెంటర్ వద్ద విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డగించారు. దీంతో పోలీసులకు విద్యార్థి సంఘాల నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త తోపులాటకు దారితీసింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో విద్యార్థి సంఘం నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. రాయలసీమ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆనందరావు ను రీకాల్ చేయాలంటూ ఆందోళన బాట పట్టిన విద్యార్థులు పలు డిమాండ్లను ప్రభుత్వ ముందుంచారు.
యూనివర్సిటీలో ఉద్యోగాలు పొందిన అక్రమ ప్రొఫెసర్లను ఉన్నత పదవి నుండి తొలగించాలని, నిర్మాణం పూర్తయి ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోని యూనివర్సిటీలోని నూతన భవనాలను ప్రారంభించాలని, డిగ్రీ పరీక్ష ఫలితాల పై సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పరీక్ష విభాగంలో చోటు చేసుకున్న అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని విద్యార్థుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్న బిఎంఎస్ సెక్యూరిటీ ఏజెన్సీని రద్దు చేయాలని విద్యార్థులు ప్రధానంగా డిమాండ్లు వినిపిస్తున్నారు.
ఇక ఇదే క్రమంలో ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాల నేతలను రెండు రోజుల ముందుగానే పోలీసులు అరెస్టు చేసినప్పటికీ, నేడు చలో రాజ్ భవన్ పేరుతో గవర్నర్ నివాసాన్ని ముట్టడించటానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అలర్ట్ అయిన పోలీసులు ఎక్కడిక్కడ విద్యార్థులను అడ్డుకోవడంతో విజయవాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక రాజ్ భవన్, ధర్నాచౌక్లో సీపీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.