ఊసరవెల్లిని మించిన జగన్: టిడిపి, సిఎం ఫ్లెక్సీ చించివేత
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రంగులు మార్చడంలో ఊసరవెల్లిని మించిపోయారని తెలుగుదేశం పార్టీ శాసన మండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు సోమవారం ధ్వజమెత్తారు. ఆర్టికల్ 3 ద్వారా రాష్ట్రాన్ని విభజించవచ్చునని సూచించిన జగన్ ఇప్పుడు దానిని సవరించమని డిమాండ్ చేయడమేమిటని ప్రశ్నించారు.
జగన్ జైలు నుండి బయటకు వచ్చాక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రాబల్యం తగ్గిపోయిందని సర్వేల ద్వారా తేటతెల్లమవుతోందన్నారు. కాంగ్రెసు రాజకీయాల్లో, రాష్ట్ర విభజనలోను జగన్ భాగస్వామి అయ్యారని ఆరోపించారు. పర్యటనల సాకుతో కోర్టు వాయిదాలను తప్పించుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

జెసిలో పౌరుషం లేదు: సోమిరెడ్డి
మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డికి సీమ పౌరుషం లేదని టిడిపి నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేరుగా ఎద్దేవా చేశారు. రాయలసీమ విచ్చిన్నానికే రాయల తెలంగాణ ప్రతిపాదన తెస్తున్నారన్నారు. ఒక ప్రాంతాన్ని విభజించాలని డిమాండ్ చేస్తుంటే రెండు ప్రాంతాలను విభజించాలనడం సరికాదన్నారు.
సిఎం ఫ్లెక్సీ చించివేత
నల్గొండ జిల్లా నకిరేకల్లో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫ్లెక్సీని కాంగ్రెసు నాయకులు చించివేశారు. పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఫ్లెక్సీని వారు ఆ తర్వాత పెట్టారు. సిఎం సందేశం లేకుండానే రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.












Click it and Unblock the Notifications