చంద్రబాబు గోలీలు, కర్రబిళ్లా ఆడారు: బాల్యం గుర్తొచ్చిందన్నారు
చంద్రబాబు గోలీలాట ఆడారు, పతంగులు ఎగురువేశారు. కర్రాబిళ్ల కూడా ఆడారు. ఈ ఆటలను చూస్తుంటే బాల్యం గుర్తొస్తోందని చెప్పారు.
విజయవాడ: సంక్రాంతి సంబరాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా ఉల్లాసంగా గడిపారు. కర్రబిళ్ల, గోలీలు ఆడారు. పతంగులను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రకృతితో మమేకం కావాలని చెప్పారు సంక్రాంతి సంబరాల్లో ఆటలను చూస్తే బాల్యం గుర్తొచ్చిందంటూ ఆయన అన్నారు.
జన్మనిచ్చిన భూమిని ఎన్నటికీ మరవకూడదని ఆయన సూచించారు. ఆధునిక యుగంలో టెక్నాలజీతో పోటీపడినా మన సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోవద్దని హితవు పలికారు. కూచిపూడి నృత్యం అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించామని తెలిపారు. 200 మంది కూచిపూడి నృత్య గురువులకు నెలకు రూ.12 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంట్లో ఒక కూచిపూడి డాన్సర్ని తీర్చిదిద్దుతామన్నారు. వ్యాయామ విద్యకు కూడా ప్రాధాన్యత కల్పిస్తున్నామని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రజలందరూ ఆనందం, ఆరోగ్యంతో గడపాలని ఆయన దేవుడిని ప్రార్థించానని చెప్పారు. ప్రకృతిని ఆరాధించాలని, ప్రకృతితో ప్రజలు కూడా మమేకం కావాలనే ఉద్దేశంతోనే పెద్దలు సంప్రదాయాలతో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని, వీటన్నిటిని మరచిపోయామని ఆయన అన్నారు.
శుక్రవారం విజయవాడ నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు చిన్నప్పుడు ఆడిన ఆటలను మరిచిపోయామని, ఇవాళ ఇక్కడ చూస్తే చిన్ననాటి స్మృతులు గుర్తుకు వచ్చాయని అన్నారు. బిల్లా, కర్ర నుంచి గోలీల వరకు అన్ని గుర్తుకు వచ్చాయని ఆయన చెప్పారు.
వారసత్వంగా వచ్చే కళలు ఉంటాయని, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో కళ ఉంటుందని చంద్రబాబు అన్నారు. ఎక్కడ ఉన్నా తల్లినీ రాష్ట్రాన్నీ మరిచిపోకూడదని అన్నారు. వివిధ నగరాల నుంచి ప్రజలు పల్లెలకు వస్తున్నట్లు చెప్పారు. మనకు ఆరోగ్యం, ఆదాయం, ఆనందం ముఖ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాథరెడ్డి, రావెల కిషోర్బాబు తదితరులు పాల్గొన్నారు.