జలీల్ ఖాన్ కుమార్తెకు టిడిపి సీటు : బెజవాడ లో ఆ మూడింటా వైసిపి -టిడిపి హోరా హోరీయేనా..!
ఏపి అధికార పార్టీలో అభ్యర్ధుల ఖరారు ప్రక్రియ మొదలైంది. కొంత కాలం క్రితం చిత్తూరు జిల్లాలో అభ్యర్ధులను ఖరా రు చేసిన టిడిపి అధినేత చంద్రబాబు ..ఇప్పుడు విజయవాడ పై దృష్టి పెట్టారు. వంగవీటి రంగా తనయుడు రాధాను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి..విజయవాడ వెస్ట్ ఈ సారి మైనార్టీ వర్గాలకు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.ఇప్పటికే వైసిపి అభ్యర్ధులు సైతం దాదాపు ఎవరో తెలిసిపోయింది. దీంతో..విజయవాడ లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది.
పార్టీ సేవలకే పరిమితం..
జలీల్ ఖాన్ విజయవాడ పశ్చిమం నుండి రెండు సార్లు గెలుపొందారు. కాంగ్రెస్ నుండి ఒకసారి..వైసిపి నుండి 2014 లో గెలిచారు. వైసిపి నుండి గెలిచిన తరువాత టిడిపి లోకి ఫిరాయించారు. అవకాశం వచ్చిన ప్రతీ సందర్భంలోనూ జగన్ పై విరుచుకుపడేవారు. ఆయనకు చంద్రబాబు నామినేటెడ్ పోస్టు సైతం కట్టబెట్టారు. ఇక, 2014 లో ఆయన టిడిపి -బిజెపి పొత్తులో భాగంగా బిజెపి అభ్యర్ధి ఎల్లంపల్లి శ్రీనివాస్ పై గెలుపొందారు. విజయవాడ నగరంలోని మూడు నియోజ కవర్గాల్లో రెండింటిని టిడిపి గెలుచుకోగా..పశ్చిమం నుండి వైసిపి అభ్యర్ధిగా జలీల్ ఖాన్ గెలుపొందారు. ఇక, జలీల్ ఖాన్ పై 2014 లో పోటీ చేసి ఓడిన ఎల్లంపల్లి శ్రీనివాస్ ప్రస్తుతం వైసిపి లో పశ్చిమ నియోకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పశ్చిమ నుండి పోటీ చేస్తారో..లేక వైసిపి సైతం మైనార్టీ అభ్యర్ధిని రంగంలోకి దింపుతుందో చూడాలి.
జలీల్ కుమార్తెకు సీటు ప్రకటన..
జలీల్ఖాన్ కుమార్తె షబానా ఖాతూర్ తండ్రి తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. సీఎం సమక్షంలో షబానా టీడీపీలో చేరారు. మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా తన కుమార్తె పేరును చంద్రబాబు ఖారారు చేసినట్లు తెలిపారు. పశ్చిమ స్థానాన్ని చంద్రబాబుకు కానుకగా ఇస్తామని జలీల్ఖాన్ అన్నారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ కాలేదని, తన సేవలను పార్టీకి వినియోగించుకుంటామని సీఎం చెప్పారని జలీల్ ఖాన్ వెల్లడించారు. మొదటి నుంచి తాను సీఎం అభిమానినని, అమెరికాలోని వర్జీనియాలో టీడీపీ కోఆర్డినేటర్గా ఉన్నానని షబానా తెలిపారు. అమెరికా నుంచి తమ కుటుంబం ఏపీకి వచ్చేసిందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి తన వంతు సాయం చేస్తానని స్పష్టం చేశారు. త్వరలో విజయవాడ పశ్చిమలో ప్రచారం ప్రారంభిస్తానని షబానా ఖాతూర్ వెల్లడించారు.
టిడిపి - వైసిపి హోరా హోరీ పోరేనా..
2014 ఎన్నికల్లో విజయవాడ లోక్సభ తో పాటుగా విజయవాడ తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్దులే గెలుపొందారు. తూర్పు నుండి గద్దే రామ్మోహన్ గెలిచారు. సెంట్రల్ నుండి బోండా ఉమా గెలుపొందారు. వంగవీటి రాధా టిడిపిలో చేరినా ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని చెబుతున్నారు. దీంతో..ఈ ఇద్దరికి టిడిపి నుండి తిరిగి టిక్కెట్లు దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో వైసిపి నుండి తూర్పు అభ్యర్ధిగా యలమంచిలి రవి ఉన్నారు. సెంట్రల్ నుండి మల్లాది విష్ణు వైసిపి నుండి బరిలోకి దిగనున్నారు. దీంతో..అందరూ గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన అనుభవం ఉన్న వారే కావటం..సామాజిక సమీకరణాలే కీలకం అవ్వటంతో ఇప్పుడు విజయవాడ నగర రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇక, ఎంపి అభ్యర్ధిగా తిరిగి నాని కే టిడిపి కేటాయించే అవకాశం ఉంది. వైసిపి నుండి ఇంకా అభ్యర్ధి ఖరారు కాలేదు. జనసేన సైతం అభ్యర్ధులను ప్రకటించనుంది. దీంతో.. అసెంబ్లీ పోరు లో మాత్రం ఈ సారి బెజవాడ రాజకీయం రంజుగా మారనుంది.