బాబు స్టయిలే వేరు: సీనియర్లను కాదని పత్తిపాటికి బాధ్యతలు
కాకినాడ: ఒకవైపు కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్తో ముద్రగడ పద్మనాభం సారథ్యంలో ఆందోళన సాగుతుండగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఈ నెల 29వ తేదీన జరుగనున్నాయి. దీంతో రాజకీయ పార్టీల నేతల ప్రచార హోరు జోరు పెరిగింది.
అధికార టీడీపీ - బీజేపీ కూటమి తరఫున నిమ్మకాయల చిన రాజప్ప, మాణిక్యాల రావు, పత్తిపాటి పుల్లారావు విస్త్రుతంగా ప్రచారంచేస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికార టీడీపీ అవినీతే ప్రధాన అస్త్రంగా ప్రచారం సాగిస్తున్నది. టీడీపీ ప్రజాప్రతినిధులు, వారి బంధువులు అక్రమాలకు పాల్పడుతూ, పేదలకు దక్కాల్సిన సంక్షేమ పథకాలను కొట్టేస్తున్నారన్న ఆరోపణలతో ముందుకు సాగుతోంది.
ఇదిలా ఉంటే ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల నిర్వహణ బాధ్యత రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు అప్పగించడంతో జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు, తెలుగు తమ్ముళ్లలో అసంత్రుప్తి వ్యక్తమవుతున్నది. స్థానిక నాయకులతో గట్టెక్కలేమని చంద్రబాబు నాయుడు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలను గట్టెక్కలేమని అనుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటమి భయంతో వారిని పక్కన పెట్టేస్తున్నారు. నయానో, నజరానాలతోనో కార్పొరేషన్ను దక్కించుకోవాలని చూస్తున్నారు. అయితే.. ఆయన తీరును స్థానిక నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. బయటి నాయకులు వచ్చి ఇక్కడ ఏం చేస్తారని పెదవి విరుస్తున్నారు.
అవమానకర రీతిలో చిన రాజప్పకు షాక్ ఇలా
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎన్నికల బాధ్యతల్లో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం వ్యవహరిస్తోంది. ఎన్నికల్లో ఆయన వల్ల కలిసొచ్చేదేమీ ఉండదనే అభిప్రాయం తెలుగు తమ్ముళ్లలో ఉన్నదని వినికిడి. ఇక, పార్టీ పరువును మంట గలిపేశారన్న ఆలోచనతో పంపకాల్లోనే సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును వ్యూహాత్మకంగా పక్కన పెట్టేశారు. మంత్రుల ద్వారా ఎమ్మెల్యేకు చెక్ పెట్టారు. ఆ మంత్రుల్లో ఒకరైన డిప్యూటీ సీఎం, హోంమంత్రి చినరాజప్పకు తాజాగా షాక్ ఇచ్చారు. అవమానకర రీతిలో ఆయన్ని పక్కన పెట్టి టీడీపీ ప్రచారం సాగిస్తున్నట్లు తెలిసింది.
Recommended Video
యనమల ఇలా...
సీట్ల పంపకాల్లో అనుసరించిన ధోరణి పార్టీని కుదిపేయడంతో చినరాజప్పకు అసమ్మతి సెగ తాకింది. ఏకపక్షంగా అభ్యర్థులను ఎంపిక చేశారని అసంతృప్తివాదులంతా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఒకవైపు కాపుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మరోవైపు నగరంలో తెలుగుదేశం పార్టీకి ఆశించినంత పట్టులేదు. ఇంకోవైపు సీట్ల పంపకాల్లో సమతూకం లేక కొన్ని సామాజిక వర్గాలు దూరమయ్యాయి. ఈ నేపథ్యంలో చినరాజప్పను నమ్ముకుంటే కష్టమన్న అభిప్రాయంతో చంద్రబాబు ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించినట్టు తెలిసింది.
పత్తిపాటి వెనుకే చినరాజప్ప ప్రచారం
ఆయన స్థానంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు బాధ్యతలు అప్పగించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజప్ప ఇకపై వెనకుండి నడవడం తప్ప ముందుండి నడిపించే పరిస్థితి లేదని పార్టీలో చర్చ జరుగుతోంది. కాకపోతే, ఎక్కడి నుంచో వచ్చిన నేతలు ఇక్కడేం చేస్తారని, అందుకే పార్టీ పరిస్థితి అలా తయారైందని కొందరు తెలుగు తమ్ముళ్లు పెదవి విరుస్తున్నారు.
కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు స్వయంగా ప్రచారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ 17 డివిజన్లలో తమ అభ్యర్థులకు చెప్పుకోదగిన రీతిలో ఓట్లు సంపాదించాలని భావిస్తున్నది. కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పంతం నానాజీ ప్రణాళికలు రూపొందించి మరీ ప్రచారంచేస్తున్నారు. ఈ డివిజన్ల పరిధిలో ఇతర పార్టీల అభ్యర్థుల గెలుపులో కాంగ్రెస్ పార్టీ కీలకం కానున్నది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనీసం 10 డివిజన్ల పరిధిలో తిరుగుబాటు అభ్యర్థుల ప్రభావం తప్పనిసరిగా కనిపించే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. వారం రోజుల్లో తమ అధినేతలను రప్పించేందుకు టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సన్నాహాలు చేస్తున్నారు.