వైసీపీది మైండ్ గేమ్: జగన్ బేరాలు ప్రారంభించారు: గెలుపు మనదే..సీట్లే తేలాలి : చంద్రబాబు ధీమా..
ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఎన్నికల్లో గెలుపు పైన ధీమా వ్యక్తం చేసారు. ఎన్నికల సమయంలో జగన్ కుట్రలకు కేసీఆర్..మోడీ కుతంత్రాలు కలిసాయన్నారు. వైసీపీ ప్రమాణ స్వీకార ముహూర్తం..మంత్రి పదవులు మైండ్గేమ్లో భాగంగా వివరించారు. ఓటింగ్ శాతం తగ్గించేందుకు కుట్ర చేసారని చంద్రబాబు ఆరోపించారు.
ప్రభుత్వం తిరిగి మనదే..
ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో పోలింగ్ సమీక్షలు ప్రారంభించారు. రాజమండ్రి లోక్సభ పరిధిలోని పార్టీ నేతలతో పోలింగ్ తీరు గురించి ఆరా తీసారు. ఎన్నికల్లో టీడీపీ గెలవటం ఖాయమని..మెజార్టీ-సీట్లు కోసమే ఆలోచన చేయాల్సి ఉందన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలు టీడీపీ వెంటే ఉన్నారని మరోసారి ఈ ఎన్నికల ద్వారా నిరూపణ అయిందన్నారు. ఎన్నికల్లో హింత..విధ్వంసాలను స్కెచ్లు వేసారని వివరించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఓటర్లు ఇతర ప్రాంతాల నుండి సొంత వాహనాల్లో వచ్చి ఓట్లు వేసారని గుర్తు చేసారు. అధికారుల్లో చీలక తేవటం మంచిది కాదని.. సమిష్టిగా పని చేయించాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేసారు. ప్రత్యర్ధుల కుట్రలను సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని విశ్లేషించారు.
వైసీపీదీ మొత్తం మైండ్గేమ్...
వైసీపీ ఎన్నికల్లో గెలవలేక మైండ్గేమ్ ఆడుతోందని చంద్రబాబు విమర్శించారు. పోటీలో అభ్యర్దులు లేనప్పుడు సర్వేలతో మైండ్ గేమ్ ఆడారని...అందులో భాగంగానే ప్రమాణ స్వీకార ముహూర్తం..మంత్రి పదవులు తీసుకొచ్చారని వివరించారు. వీరి కుట్రలకు ప్రశాంత్ కిషోర్ తోడయ్యారని పేర్కొన్నారు. టీడీపీ నేతలను బెదిరింపులకు గురి చేశారని ఆరోపించారు. రాబోయే ప్రతి ఎన్నికలోనూ మనమే గెలవాలంటూ పిలుపు నిచ్చారు. ప్రతి కార్యకర్త పొలిటికల్ ఇంటెలిజెన్స్ పెంచుకోవాలని చంద్రబాబు సూచించారు. తాను ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 110 బహిరంగసభలు, రోడ్ షోలు చేయగా... ప్రతిపక్ష నేత 60-70 సభలు పెట్టలేకపోయారని ఎద్దేవా చేసారు. తెలంగాణలో ఎమ్మెల్యేలు ఊళ్లకు వెళ్తే నిలదీశారుని గుర్తు చేసారు. మన ఎమ్మెల్యేలపై పనులు చేయలేదనే అసంతృప్తి లేదన్నారు.
ఎంతో మంది విలన్లను తట్టుకున్నాం..
ఎన్నికల సమయంలో ఎంతో మంది కుట్రదారులను అదే విధంగా ఎంతో మంది విలన్లను తట్టుకుని నిలబడ్డామని చంద్రబాబు పార్టీ నేతలను వివరించారు. ఏపీలో ఓటేసేందుకు రాకుండా కేసీఆర్ అడ్డుకున్నారన్నారు. వచ్చే రెండు, మూడు సీట్లకు జగన్ బేరాలు ప్రారంభించారని చంద్రబాబు మండిపడ్డారు. అభివృద్ది-సంక్షేమానికి ప్రజలు పెద్దపీట వేసారని..తమ పాలనకు అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలవటం ఖాయమని..ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామంటూ చంద్రబాబు ధీమా వ్యక్తం చేసారు. ఈ ఎన్నికలతో విశ్రమించకుండా వచ్చే స్థానిక సంస్థలు.. మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.