కొత్త వ్యూహంతో చంద్రబాబు: అమరావతి గ్రామాల్లో పర్యటన: రైతుల నిరసనలకు మద్దతుగా..!
మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. రాజధాని తరలింపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా స్థానిక గ్రామాల ప్రజలు..రైతులు ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా ఆ గ్రామాల్లో పర్యటించి..వారికి చంద్రబాబు సంఘీభావం ప్రకటించాలని నిర్ణయించారు. అసెంబ్లీ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేసిన వెంటనే చంద్రబాబు దానిని తప్పుబట్టారు. అమరావతి గ్రామాల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు మద్దతు ప్రకటించారు.
అయితే, చంద్రబాబు ఈ ప్రతిపాదన మీద వ్యతిరేకంగా స్పందించే రాయలసీమ.. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పార్టీ నష్టపోతుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. కానీ..తన మాట నమ్మి భూములు ఇచ్చిన రైతులు..రోడ్ల మీదకు వచ్చిన సమయంలో వారికి సంఘీభావం ప్రకటించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, జీఎన్ రావు కమిటీ సిఫార్సుల మీద చంద్రబాబు ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో...చంద్రబాబు రాజధాని గ్రామాల పర్యటన పైన ఆసక్తి నెలకొని ఉంది.
అమరావతికి మద్దతుగా చంద్రబాబు
తన హాయంలో రాజధాని కోసం రైతుల నుండి భూ సమీకణ చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు వారి ఆందోళనకు మద్దతు ప్రకటిస్తున్నారు. ముఖ్యమంత్రి మూడు రాజధానుల ప్రకటన తరువాత విభేదించిన చంద్రబాబు..ఇప్పుడు ఇదే అంశానికి వ్యతిరేకంగా స్థానికులు..రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. దీక్షలు చేస్తున్నారు. తాము రాజధాని కోసం భూములు ఇచ్చామని..ఇప్పుడు రాజధాని మారిస్తే తమకు భవిష్యత్ లేదని రైతులు వాపోతున్నారు.
దీంతో వారు ఆరు రోజులుగా చేస్తున్న నిరసనలకు మద్దతు ప్రకటిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించారు. నిరసన చేస్తున్న రైతులతో మాట్లాడి వారికి మద్దతు ప్రకటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. తన మాట కోసం భూములు ఇచ్చిన రైతులు ఆందోళనతో ఉన్న సమయంలో మద్దతివ్వాల్సిన అసవరం ఉందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు.
రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయా..
ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ తన నిర్ణయంతో అటు రాయలసీమ..ఇటు ఉత్తరాంధ్రతో రాజకీయంగా పట్టు సాధించే వ్యూహం అమలు చేస్తున్నారని విశ్లేషకుల అభిప్రామం. అయితే, చంద్రబాబు అమరావతి నుండి రాజధాని తరలింపు నిర్ణయాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారని..దీని ద్వారా ఆ రెండు ప్రాంతాల్లో మరింతగా వైసీపీ బలపడేందుకు జగన్ పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తోందంటున్నారు.
ఇదే సమయం లో చంద్రబాబు సైతం తొలి రోజు సీఎం జగన్ ప్రతిపాదన వ్యతిరేకించినా..ఆ తరువాత దీని గురించి వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ, ఇప్పుడు రాజధాని రైతులకు మద్దతు ప్రకటించటం ద్వారా ..ఏరకమైన డిమాండ్లు ప్రభుత్వం ముందుంచుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
ఇబ్బంది పెడతారా..ఇబ్బందుల్లో పడతారా
ఇప్పుడు రాయలసీమ..ఉత్తరాంధ్రలో టీడీపీ నేతలే ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ సమయంలోనే అమరావతిలో రైతులు ఆందోళన చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో అనేక సంస్థలు భూ కేటాయింపులు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. తాము అమరావతి రైతులకు అన్యాయం చేయమని ప్రభుత్వం చెబుతోంది. ఇదే సమయంలో బీజేపీ..వామపక్షాలు సైతం రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్నాయి.
వికేంద్రీకరణ అవసరమే అంటూనే..అసెంబ్లీ.. సచివాలయం ఒక్క చోటే ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో..ఇప్పుడు అమరావతిలో పర్యటిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారా..లేక రాజకీయంగా ఇరుకున పడతారా అనే ఆసక్తి కర చర్చ మొదలైంది.