భీమ్లానాయక్ కు వేధింపులా : ప్రభుత్వ ఉగ్రవాదం - సినిమా పరిశ్రమైనా : చంద్రబాబు..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ విడుదలైంది. ఈ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వ తీరు పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. థియేటర్లకు నోటీసులు..బెనిఫిట్ షో లకు అనుమతి ఇవ్వక పోవటంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కళ్యాన్ ను టార్గెట్ చేస్తూ ప్రభుత్వం సినీ పరిశ్రమను వేధిస్తోందంటూ విమర్శలు మొదలయ్యాయి. ఇప్పుడు ఇదే అంశం పైన టీడీప అధినేత చంద్రబాబు స్పందించారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సిఎం జగన్ వదలడం లేదని ఆరోపించారు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నారంటూ మండిపడ్డారు.
ప్రభుత్వ ఉగ్రవాదం అంటూ
భీమ్లానాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తుందని వ్యాఖ్యానించారు. వ్యక్తులను టార్గెట్ గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. భారతీ సిమెంట్ రేటు పై లేని నియంత్రణ భీమ్లా నాయక్ సినిమా పై ఎందుకని ప్రశ్నించారు. ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో వేధిస్తున్న జగన్...తన మూర్ఖపు వైఖరి వీడాలని సూచించారు.
రెవిన్యూ ఉద్యోగులను కాపలా పెట్టి
రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టి...థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరం అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తమ వారిని రక్షించేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తుంటే....ఆంధ్ర ప్రదేశ్ సిఎం మాత్రం భీమ్లా నాయక్ పై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారని విమర్శించారు. తెలుగు దేశం తప్పును ఎప్పుడూ ప్రశ్నిస్తుంది...నిలదీస్తుందని స్పష్టం చేసారు.
వేధింపులు విరమించుకోవాలి
భీమ్లా నాయక్ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. దీనికి ముందు పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ సైతం ప్రభుత్వం భీమ్లానాయక్ విడుదల సమయంలో వ్యవహరిస్తున్న తీరును తప్పు బడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇక, పవన్ అభిమానులు సైతం పలు థియేటర్ల వద్ద ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి దీని పైన ఎవరూ అధికారికంగా ఇంకా స్పందించలేదు.