ఇంటర్ పరీక్షల వ్యవహారంలో కేసీఆర్కు చురకలు అంటించిన బాబు. అధికారుల మధ్య చీలక కుట్ర జరుగుతోందని
Recommended Video
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన పరోక్ష వ్యాఖ్యలు చేసారు. ఇంటర్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేరంటూ ఎద్దేవా చేసారు. తెలంగాణలో ముఖ్యమంత్రి సమీక్షలు చేస్తే ఎవరూ మాట్లాడరని.. తాను సమీక్షలు చేస్తే నానా యాగీ చేస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
ఇంటర్ పరీక్షలు కూడా నిర్వహించలేరు..
తెలంగాణలో కొద్ది రోజులుగా ఇంటర్ పరీక్షా ఫలితాల్లో గందరగోళం జరుగుతోంది. దీని పైన విద్యార్దులు..తల్లి దండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని పైన స్పందించిన కేసీఆర్ ఫెయిల్ అయిన అందరు విద్యార్దుల పరీక్షా పత్రాలను ఉచితంగా రీ వాల్యుయేషన్ చేయాలని ఆదేశించారు. ఇప్పుడు, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేరంటూ ఎద్దేవా చేసారు. తెలంగాణ ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహిస్తే ఎవరూ నోరు మెదపరని..ఏపిలో మాత్రం తాము ఏదైనా సమీక్ష పెడుతుంటే మాత్రం నానా యాగీ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారు మాత్రమే ఎన్నికల సంఘం పరిధిలో పని చేయాల్సి ఉంటుందని వివరించారు. మిగిలిన వారు ప్రభుత్వం కిందే పనిచేయాలని సీయం పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం కండి..
సార్వత్రిక ఎన్నికలు పూర్తి కాగానే..టిడిపి నేతలు, కార్యకర్తలంతా స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టిడిపి నేతలకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు పూర్తి కాగానే..స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని చెప్పుకొచ్చారు. ఎన్నికల విధుల్లో ఉన్నవారు ఇసి పరిధిలో పని చేయాలన్నారు. ఎవరి పరిధిలో వారు పని చేయాలని.. ఈసీ ఇష్టానుసారం వ్యవహరిస్తే పాలన అస్తవ్యస్తం అవుతుందన్నారు. ఈ ఐదేళ్లు అధికారులు తమకెంతో సహకరించారని చంద్రబాబు వివరించారు. తాము అధికారుల సహకారంతోనే అనేక రంగాల్లో తాము నంబర్ ఒన్ స్థానంలో నిలిచామన్నారు. ఎన్నికల్లో కొందరు నేతలు డ్రామాలు ఆడారని..కార్యకర్తలు మాత్రం అంకిత భావంతో పని చేసారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
అధికారుల మధ్య చీలిక తెస్తున్నారు..
ఏపిలో ఈసీ రూపంలో అధికారుల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. కులం, మతం, వ్యక్తిగత అజెండాలతో అధికారుల మధ్య చీలిక తెచ్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. దీనిని కూడా సమర్థంగా తిప్పికొడదామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షలకు హాజరు కావద్దంటూ అధికారులక సీయస్ సూచిస్తున్నారని...ప్రజా సమస్యల పైన సమీక్షించే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందని టిడిపి నేతలు వాదిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించకూడదని ఎన్నికల సంఘం చెబుతోంది. దీంతో..ఏపిలో అధికారులు అటు ఎన్నికల సంఘం.. ఇటు ముఖ్యమంత్రి ఆదేశాల్లో ఎవరివి అమలు చేయాలో అర్దం కాక నలిగిపోతున్నారు.