రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదు, ప్రభుత్వానికి ఉసురు తగులుతుంది: చంద్రబాబు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పాలన పడకేసిందని ఆయన విమర్శించారు. ఇవాళ రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరిని దుయ్యబట్టారు. పలు విధాలుగా అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫైరయ్యారు.
రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదు అంటారు.. పాలకులు ఇది గ్రహించకపోతే పుట్టగతులు ఉండవని చంద్రబాబు అన్నారు. రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉండటం దారుణం అన్నారు. ఇదీ రైతుల పట్ల ప్రభుత్వం చూపుతోన్న వివక్షకు సజీవ సాక్షం అని తెలిపారు. దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అన్నదాతలపై పైపై ప్రేమ కనబరచి.. లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. కానీ ప్రజలు అన్నీ గ్రహిస్తున్నారని తెలిపారు.
రాజధాని అమరావతి కోసం రైతుల పోరాటం ఏడాది గడచిపోయిందని చెప్పారు. 110 మందికిపైగా రైతులు చనిపోయారని తెలిపారు. వరదలు, భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పరిహారం అడిగితే సభలో మాపై దాడికి తెగబడ్డారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ విషయం యావత్ ప్రపంచానికి తెలుసు అని చెప్పారు. టీడీపీ హయాంలో ఇచ్చిన సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వంలో మాత్రం ఏ చలనం లేదన్నారు.
మూడు రాజధానుల అంశం ప్రపంచంలో ఎక్కడ వర్కవుట్ కాలేదన్నారు. అమరావతి నుంచి రాజధాని తరలించాలనే జగన్ సర్కార్ కమిటీలను వేసిందని చెప్పారు. ప్రభుత్వం చెప్పినట్టే కమిటీలు రిపోర్ట్ ఇచ్చాయని పేర్కొన్నారు. కానీ చట్టసభలో రాజధాని తరలింపు అంశం వాయిదా పడిందని చెప్పారు. దీనిపై రైతులు ఎన్ని విజ్ఞప్తులు చేసినా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అని తెలిపారు.