రెండో జాబితా పై చంద్రబాబు, పవన్ కసరత్తు - లిస్టులో..!!
ఏపీలో ఎన్నికల పోరు హోరా హోరీగా మారుతోంది. టీడీపీ, జనసేన తమ తొలి జాబితా ప్రకటించాయి. రెండో జాబితా విడుదలకు చంద్రబాబు, పవన్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రెండు పార్టీల నుంచి 99 మంది అభ్యర్దులను ప్రకటించారు. బీజేపీ తమతో కలిసి వస్తుందనే సంకేతాలు కనిస్తున్నా..అధికారికంగా స్పష్టత రాలేదు. దీంతో, బీజేపీకి కేటాయించే స్థానాలపైన అంచనాకు రావటంతో..మిగిలిన స్థానాల్లో తమ అభ్యర్దులను ఖరారు చేయాలని నిర్ణయించారు.
పొత్తులు లెక్కలు : జగన్ ఓటమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ అడుగులు వేస్తున్నారు. బీజేపీతో పొత్తు పైన ఇప్పటికే చంద్రబాబు, పవన్ ఢిల్లీలో మంతనాలు సాగించారు. బీజేపీ నుంచి సీట్ల సర్దుబాటు పైన ప్రాధమికంగా చర్చలు పూర్తయినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో బీజేపీ వైఖరి ఏంటనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ ఎంపీ సీట్లను ఎక్కువ సంఖ్యలో కోరుతోంది. 10 ఎంపీ సీట్లు ఇవ్వాలని కోరుతున్నా.. 4-5 స్థానాలు ఇచ్చేందుకు నిర్ణయం జరిగినట్లు సమాచారం. అదే విధంగా 10-12 ఎమ్మెల్యేలు స్థానాలు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. బీజేపీ అధికారికంగా పొత్తు పైన ప్రకటన చేసిన తరువాత మూడు పార్టీలు కలిసి ఎన్నిక ప్రచారం, మేనిఫెస్టో పైన నిర్ణయాలు తీసుకోనున్నాయి.

అభ్యర్దుల ఎంపిక : బీజేపీ పొత్తు చర్చల వేళ టీడీపీ, జనసేన రెండు పార్టీలు ఎంపీ అభ్యర్దులను ప్రకటించలేదు. జనసేనకు పొత్తులో భాగంగా 24 స్థానాలు కేటాయించారు. వాటిలో 5 స్థానాలకు పవన్ తమ అభ్యర్దులను ప్రకటించారు. టీడీపీ 94 మంది అభ్యర్దులను ఖరారు చేసింది. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చారు. పవన్ కల్యాణ్ తాను పోటీ చేసే స్థానం పైన రెండో జాబితాలో స్పష్టత ఇవ్వనున్నారు. భీమవరం నుంచి పవన్ పోటీ చేస్తారని ప్రచారం సాగినా..పిఠాపురం నుంచి బరిలోకి దిగుతారని చెబుతున్నారు. గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖ జిల్లాలో పవన్ ఎక్కువ సీట్లు కోరుకుంటున్నారు. దీంతో..తొలి జాబితాలో టీడీపీ నుంచి పలువురు సీనియర్ల సీట్లు పెండింగ్ లో ఉన్నాయి. పొత్తులో భాగంగా కొన్ని సీట్లు జనసేనకు ఖాయమయ్యాయి.

రెండో జాబితాపై కసరత్తు : సీట్లు దక్కని సీనియర్లతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భవిష్యత్ పైన హామీ ఇచ్చారు. ఇప్పుడు రెండో జాబితాలో బీసీ, మైనార్టీ వర్గాలకు సీట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ పొత్తు ఖాయమైతే ఆ పార్టీకి ఏ సీట్లు ఇస్తారనేది ఇప్పుడు ఈ రెండు పార్టీల్లో ఆసక్తి కరంగా మారుతోంది. మూడు పార్టీల మధ్య సమన్వయం, ఓట్ల బదిలీ జరిగిలా నిర్ణయాలు ఉండాలని భావిస్తున్నారు. వచ్చే వారంలో బీజేపీ పొత్తు తేలిన వెంటనే మూడు పార్టీలు కలిసి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ మరింత ఆలస్యం చేస్తే చంద్రబాబు, పవన్ తమ రెండో జాబితా విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో, రెండు పార్టీల ఆశావాహుల్లో రెండో జాబితా పైన ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications