నంద్యాల..కర్నూలు సీట్లు మనవే : చంద్రబాబు ధీమా: టీడీపీ నేతలు..వైసీపీ మాత్రం ఇలా..!
టీడీపీ అధినేత చంద్రబాబులో గెలుపుపై ధీమా కంటిన్యూ అవుతోంది. ఇప్పటి వరకు అసెంబ్లీ సీట్ల గురించే మాట్లాడిన చంద్రబాబు తాజాగా లోక్సభ సీట్లలోనూ విజయం తమదే అంటున్నారు. అందునా ముఖ్యమంత్రి నంద్యాల.. కర్నూలు లోక్సభ సీట్లలో టీడీపీ గెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కర్నూలు జిల్లా టీడీపీ నేతల లెక్కలు మాత్రం మరోలా ఉన్నాయి. ఇక..వైసీపీ నేతలు మాత్రం తొలి నుండి ఈ రెండు స్థానాల పైనే అవే లెక్కలు కంటిన్యూ చేస్తున్నారు. దీంతో...ఇప్పుడు ఈ రెండు స్థానాల ఫలితాల మీద ఆసక్తి పెరుగుతోంది.
నంద్యాలలో ధీమా వెనుక..
కర్నూలు జిల్లా నంద్యాల లోక్సభ అభ్యర్దిగా మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి టీడీపీ అభ్యర్దిగా బరిలో ఉన్నారు. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న దివంగత ఎస్పీవై రెడ్డి 2014లో వైసీపీ నుండి గెలిచి టీడీపీలోకి ఫిరాయించారు. ఈ సారి ఎన్నికల్లో జనసేన నుండి పోటీ చేసారు. అయితే, ఆయన కొద్ది రోజుల క్రితమే మరణించారు. ఇక, టీడీపీలో బరిలో ఉన్న శివానందరెడ్డి పోలింగ్ సరళి పైన సర్వే చేయించారు. దానిని చంద్రబాబుకు అందించారు. మహిళలు..వృద్దులు మొత్తంగా టీడీపీకే ఓటు వేసారని నివేదిక ఇచ్చారు. సమీక్షలోనూ పార్టీ అధినేతకు అదే విషయం చెప్పుకొచ్చారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీడీపీ సాధించే సీట్లు అంటూ కర్నూలు జిల్లాలో మొత్తంగా పది స్థానాల వరకు గెలిచే అవకాశం ఉందని నివేదించారు. ఇదే సమయంలోనూ కర్నలు లోక్సభ పరధిలో పరిస్థితి పైనా నేతలు అధినేతకు నివేదికలు ఇచ్చారు. ఇక, జనసేన నుండి పోటీ చేసిన ఎస్పీవై రెడ్డికి సొంత ఓట్ బ్యాంక్ ఉందని.అది ఏ పార్టీకి నష్టం చేసందనేది స్పష్టత రాలేదు.
కోట్ల రాకతో సీన్ మారిపోయిందంటూ..
ఇక, కర్నూలు లోక్సభ నియోజకవర్గ పరిధిలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వర్గం..కాంగ్రెస్ నుండి టీడీపీలో చేరిన తరువాత టీడీపీ నేతలతో కలిసి పని చేసారని చంద్రబాబు విశ్లేషించారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి విజయం ఖాయమనే సర్వే నివేదికలు చెబుతున్నారని వివరించారు. అదే విధంగా..అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇతర పార్టీలకు ఓటు వేసిన వారు కూడా ఎంపీ ఓట్లు మాత్రం కోట్ల వైపే మొగ్గు చూపారని సర్వే నివేదికల్లో తేలిందని చెప్పుకొచ్చారు. ఇక, ఇదే సమయంలో వైసీపీ ఎంపీ అభ్యర్దులుగా నంద్యాల నుండి బ్రహ్మనందరెడ్డి..కర్నూలు నుండి బీసీ నేత డాక్టర్ సంజీవకుమార్ పోటీలో ఉన్నారు. కర్నూలు నుండి బీసీకి అవకాశం ఇవ్వటం ద్వారా జిల్లాలోని బీసీలు వైసీపీ వైపు మొగ్గు చూపారని కొందరు టీడీపీ నేతలే ప్రస్తావించినట్లు సమాచారం.
బీసీ ఫ్యాక్టర్ వర్కవుట్ అవుతే..
కర్నూలు లోక్సభ స్థానం బీసీలకు ఇవ్వటం ద్వారా వైసీపీ పట్ల బీసీ వర్గాలు సానుకూలంగా ఉన్నాయని కొందరు నేతలు విశ్లేషించినట్లు సమాచారం. అదే సమయంలో.. అనంతపురం జిల్లాలోని రెండు లోక్సభ సీట్లనూ బీసీ నేతలకే ఇవ్వటం వలన..అది కూడా జిల్లాలో ప్రభావం చూపించిందని..సామాజిక సమీకరణాలు సైతం వైసీపీ ఎలక్షనీరింగ్ లో పక్కాగా అమలు చేసిందనే విశ్లేషణ కొందరు నేతలు తెర మీదకు తెచ్చారు. ఇక, 2014 ఎన్నికల్లో టీడీపీ కర్నూలు జిల్లాలో మూడు సీట్లు మాత్రమే సాధించింది. కానీ, ఈసారి పది సీట్ల వరకు గెలుస్తుందని పార్టీ నేతలు తమ నివేదికలు అధినేతకు నివేదించారు. వైసీపీ ఈ సారి ఎన్నికల్లో జిల్లాలో స్వీప్ చేస్తామని ధీమాగా చెబుతున్నారు. జిల్లాలో పార్టీ ఫిరాయింపుల మీద ప్రజలు అసంతృప్తితో ఉన్నారని విశ్లేషించారు. వైసిపీ అంచనా వేసినట్లుగా జిల్లాలో బీసీ ఫ్యాక్టర్ వర్కవుట్ అయితే ఖచ్చితంగా జిల్లాలో మెజార్టీ సీట్లు వస్తాయని టీడీపీ నేతలు అంగీకరిస్తున్నారు.