2024 సీట్లపై తేల్చేసిన చంద్రబాబు : పొత్తులు- కొత్త వ్యూహాలు : లోకేష్ కోసం పక్కాగా..!!
టీడీపీ చంద్రబాబు కీలక నిర్ణయాల దిశగా కసరత్తు చేస్తున్నారు. 2024 ఎన్నికలు పార్టీకి ..వ్యక్తిగతంగా చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో చంద్రబాబు పక్కా వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా.. పార్టీ 40వ ఆవిర్భవ దినోత్సవం నాడు దీనికి సంబంధించి సంకేతాలు ఇచ్చారు. సీనియర్లకు తగిన గౌరవం పార్టీలో లభిస్తుందని చెబుతూనే.. యువత గురించి ఎక్కుగా ఫోకస్ చేయనున్నట్లు స్పష్టంగా వెల్లడించారు. అందులో భాగంగా యువతకు 40 శాతం సీట్లు యువతకు కేటాయించనున్నట్లుగా ప్రకటించారు. ఫలితంగా ప్రస్తుతం ఉన్న సీనియర్ల వారసులు .. అందునా లోకేష్ కు మద్దతుగా నిలుస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టమవుతోంది.

క్రియాశీలకంగా మారుతున్న లోకేష్
దీని ద్వారా రానున్న రోజుల్లో లోకేష్ కు పార్టీలో మద్దతు పెరిగేలా వ్యూహాత్మకంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ముందుగా 2024 అధికారం దక్కించుకోవటం..లోకేష్ కు ప్రాధాన్యత పెరగటం ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. చాలా కాలం తరువాత పార్టీ 40వ వార్షికోత్సవ వేడుకలతో తెలుగు దేశం లో కొత్త జోష్ కనిపించింది. విదేశాల్లో ఉన్న టీడీపీ అభిమానులు సైతం వేడుకలు నిర్వహించినా.. ఏపీలోని టీడీపీ శ్రేణులు ఇంత భారీగా కదలటం ఈ మధ్య కాలంలో ఇదే. ఇక, పార్టీ సభ్యత్వం పైనా చంద్రబాబు ఫోకస్ పెట్టారు. 70 లక్షల మంది కార్యకర్తలు...వారికి ఇప్పటి వరకు చెల్లించిన భీమా రూ 100 కోట్లుగా చంద్రబాబు వెల్లడించారు. ఇప్పుడు తాజాగా.. సభ్యత్వం తీసుకున్న వారికి కొత్తగా ఆరోగ్య భీమా పైన ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

సభ్యత్వ నమోదు నుంచే వ్యూహాత్మకంగా
ఇక, సభ్యత్వంతో పాటుగా పార్టీకి డొనేషన్లు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. వచ్చే ఎన్నికల్లో డబ్బుతో గెలవాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని...కానీ, అది సాధ్యం కాదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక, వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంలోనూ చంద్రబాబు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. కుప్పం వేదికగా జనసేనతో పొత్తు విషయంలో ఒన్ సైడ్ లవ్ సరి కాదని..అటు నుంచి ఆసక్తి ఉండాలని వ్యాఖ్యానించారు. అయితే, తాజాగా జనసేన ఆవిర్బావ సభలో పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పటం ద్వారా..రానున్న ఎన్నికల్లో 2014 పొత్తులు రిపీట్ అవుతాయని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. బీజేపీతో సాధ్యం కాకపోతే..జనసేన -టీడీపీ కలిసి పోటీ చేయాలని మాజీ మంత్రులు సైతం ఓపెన్ గానే కోరుకుంటున్నారు. అయితే, తాము పొత్తు కోసం వెంపర్లాడుతున్నామనే సంకేతాలు -అభిప్రాయాలకు అవకాశం లేకుండా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పొత్తుల పై ఆచితూచి.. యువతకు ప్రాధాన్యత
దీని ద్వారా వచ్చే ఎన్నికల్లో పొత్తులు... యువతకు ప్రాధాన్యత ద్వారా.. 2024 అధికారమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో సీనియర్లు..టిక్కెట్ దక్కని వారిని సైతం మానసికంగా ఇప్పటి నుంచే సంసిద్దులను చేస్తున్నారు. దీంతో..రానున్న రోజుల్లో లోకేష్ పాత్ర పార్టీలో మరింత కీలకం కానుందనేది సుస్పష్టం. కొంత కాలంగా లోకేష్ శైలిలోనూ పూర్తిగా మార్పు కనిపిస్తోంది. జిల్లాల పర్యటనలు..ఓదార్పులు.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటంలో గతం కంటే భిన్నంగా ముందుకెళ్తున్నారు. అదే సమయంలో తాను 2019లో ఎక్కడ ఓడానో..అక్కడే తిరిగి గెలిచి చూపించాలనే లక్ష్యంతో మంగళగిరి లో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. తాజాగా.. పార్టీ 40 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం నాడు మంగళగిరి నుంచే లోకేష్ తన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో..చంద్రబాబు వ్యూహాలు పార్టీకి ఎంత వరకు ఫలితాలు సాధించి పెడతాయనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications