స్పీకర్ నియోజకవర్గంలో చంద్రబాబు - ఇంటింటికి వెళ్లేలా: సహపంక్తి భోజనం..!!
టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనలు ప్రారంభం అవుతున్నాయి. ముందుగా స్పీకర్ తమ్మినేని ఇలాకా నుంచి పర్యటనలు ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించారు. జిల్లాల పర్యటనల్లో భాగంగా..చంద్రబాబు ఎంచుకున్న నియోజకవర్గాలు ఆసక్తి కరంగా మారాయి. శ్రీకాకుళంలో స్పీకర్ నియోకకవర్గం ఆముదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం దల్లవలస గ్రామంలో పర్యటించనున్నారు. తమ్మినేని 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి కూన రవి కుమార్ పైన గెలుపొందారు. అసెంబ్లీలోనూ స్పీకర్ నిర్ణయాల పైన చంద్రబాబు పలు సందర్భాల్లో అభ్యంతరం వ్యక్తం చేసారు.
ఇక, చంద్రబాబు అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తరువాత ఇప్పుడు జిల్లాల పర్యటనలు మొదలు పెట్టారు. అందులో భాగంగా.. రేపు ( బుధవారం) చంద్రబాబు రేపు సాయంత్రం 4 గంటలు నుండి 6 గంటలవరకు వరకు గ్రామంలో పర్యటించనున్నారు. ఇంటింటికి తిరిగి ప్రజల నుండి సమస్యలు తెలుసుకుంటారు. నిత్యావసర ధరల పెరుగుదల, విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపుదల ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించనున్నారు. ఆ తరువాత గ్రామ ప్రజలతో గ్రామ సభ నిర్వహించనున్నారు. గ్రామంలోని దళిత , బడుగు , బలహీన వర్గాల సహపంక్తి భోజనం చేయనున్నారు.
టీడీపీ నిర్ణయించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఆముదాలవలస తరువాత విశాఖ జిల్లాలో మాజీ మంత్రి అవంతి ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గ పరిధిలోని తాళ్లవలసలో పర్యటించేలా షెడ్యూల్ ఖరారైంది. సీఎం జగన్ తాజాగా విశాఖ పర్యటనలో ఉత్తరాంధ్ర ఆత్మగౌరవం కోసం పరిపాలనా రాజధానికి ఆలోచన చేస్తే..అడ్డుకున్నారంటూ వ్యాఖ్యానించారు.
దీంతో..ఇదే జిల్లా నుంచి చంద్రబాబు సైతం తన పర్యటనలో మూడు రాజధానులు..విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయటం విషయంలో తమ వైఖరి మరోసారి స్పష్టం చేయనున్నారు. దీంతో..విశాఖ కేంద్రంగా చంద్రబాబు ఏం చెబుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇక, ఆ తరువాత తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరంలో చంద్రబాబు సభ ఏర్పాటు చేసారు. మహానాడు వరకు చంద్రబాబు జిల్లాల పర్యటన ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. చివరగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో సభ ఉండేలా చంద్రబాబు పర్యటనలు సిద్దం కానున్నాయి.