కాంగ్రెస్ కేసులకు కౌంటర్: సోనియా, రఘువీరాలపై చంద్ర దండు
అనంతపురం: ప్రత్యేక హోదా కోసం కాంగ్రెసు పార్టీ చేస్తున్న ఆందోళనకు తెలుగుదేశం పార్టీ విరుగుడు కనిపెట్టినట్లే ఉంది. ప్రత్యేక హోదాపై, ఎపికి ఇచ్చిన హామీలపై మోసం చేశారంటూ కాంగ్రెసు పార్టీ నాయకులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడులపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
అనంతపురంలో ఎపి పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి ఫిర్యాదు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ ప్రతి ఇవ్వాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించారు. దాంతో ఆయనను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో అనంతపురంలో చంద్రదండు తెర మీదికి వచ్చింది.
రాష్ట్రాన్ని సోనియా అడ్డగొలుగా విభజించిందని చంద్రదండు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం సాయంత్రం అనంతపురంలో చంద్ర దండు ఆధ్వర్యంలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, రఘువీరా దిష్టిబొమ్మలు దహనం చేశారు.
ఆంధ్ర ప్రజల మనోభావాలకు విరుద్ధంగా, రాష్ట్రాన్ని విభజించిన సోనియా ఆమె మాటలకు వత్తాసు పలుకుతున్న రఘువీరారెడ్డి ఇక్కడి ప్రజలను మోసం చేశారని వారు ఆరోపించారు. అనంతరం సోనియా, రఘువీరారెడ్డిపై టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ చంద్రదండు అనంతపురం వరకే పరిమితమవుతుందా, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తుందా అనేది వేచి చూడాలి.
కాగా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ధర్నాకు దిగిన రఘువీరాపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ధర్నాలు, దీక్షలు ఎందుకని అడిగారు.