అరగంటలోనే: విభజనపై బాబు సంచలనం, కేసీఆర్ రెచ్చగొడ్తున్నారు, రాజధానిపై..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కలెక్టర్ల సమావేశంలో ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర విభజనను పార్లమెంటులో అరగంటలో ముగించారని, కట్టుబట్టలతో ఏపీ ప్రజలను పంపించారని కాంగ్రెస్ పార్టీ పైన నిప్పులు చెరిగారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించే పరిస్థితి కనిపించడం లేదని, భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
రాజధాని పేరుతో చిచ్చు
విభజన ప్రభావం ఏపీ ప్రజల పైన తీవ్రంగా పడిందన్నారు. రాష్ట్ర విభజన తంతును అరగంటలో ముగించారన్నారు. రాజధాని ఎంపిక పేరుతో శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసి మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారన్నారు. ఆంధ్రా ప్రజలు విభజన జరగరాదని భావించారన్నారు. రాజధాని ఎంపికపై శివరామకృష్ణ కమిటీలోను చిచ్చు పెట్టారన్నారు.
విభజన జరిగిన తీరు పట్ల ప్రజలు తీవ్రంగా కలత చెందారన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాకుండా ఏపీ ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. విభజన హేతుబద్దంగా జరగలేదన్నారు. రాజధాని లేకుండా కట్టుబట్టలతో పంపించారని ధ్వజమెత్తారు.

జూన్ 2న ఉత్సవాలు కాదు.. నవ నిర్మాణ దీక్ష, వారు అసూయపడేలా
జూన్ 2న ఉత్సవాలు కాదని... నవ నిర్మాణ దీక్ష చేస్తామన్నారు. నవ నిర్మాణ దీక్షలో అందరు పాల్గొనాలన్నారు. ప్రజలు పునరంకితమయ్యేలా స్ఫూర్తి నిచ్చేందుకు దీక్ష చేస్తున్నామన్నారు. ఆరో తరగతి నుండి ప్రతి ఒక్కరు దీక్షలో పాల్గొనాలన్నారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొనాలన్నారు. రాజధాని విషయంలో మేం చెప్పిందే ప్రజలు నమ్మారన్నారు. కలిసి కట్టుగా పని చేసి ఫలితాలు సాధించేందుకు నవ నిర్మాణ దీక్ష అన్నారు. ఉదయం తొమ్మిది గంటల నుండి అరగంట పాటు దీక్ష అన్నారు.
విభజించిన వాళ్లు అసూయపడేలా నవ నిర్మాణ దీక్ష ఉంటుందన్నారు. ఉద్యోగులు హైదరాబాద్ నుండి ఆంధ్రాకు వెళ్లి నవ నిర్మాణ దీక్షలో పాల్గొనాలన్నారు. జూన్ 3వ తేదీ నుండి జన్మభూమి - మా ఊరు ప్రారంభమవుతుందని చెప్పారు.
తెలంగాణ రెచ్చగొడుతోంది
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించే పరిస్థితి కనిపించడం లేదన్నారు. భావోద్వేగాలు రెచ్చగొట్టే ధోరణి వారిలో కనిపిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications