ఒకే వేదికపై చంద్రబాబు - పవన్- బీజేపీ..! అక్కడి నుంచే తొలి అడుగు: టార్గెట్ ఫిక్స్..!!
ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. అందులో భాగంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు - జనసేనాని పవన్ కళ్యాణ్ తో సహా ఇతర పక్షాల నేతలు ఒకే వేదిక మీదకు వచ్చేందుకు ముహూర్తం ఖారారైంది. సీఎం జగన్ టార్గెట్ గా ఈ నేతలంతా ఒకే అంశం పైన ఒకే వాయిస్ వినిపించేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు ఇప్పటికే రంగం సిద్దమైంది. ఇది ఏపీ రాజకీయాల్లో మరోసారి పాత మిత్రుల కలయిక దిశగా తొలి అడుగుగా కనిపిస్తోంది.
Recommended Video


అమరావతి కేంద్రంగా ఆ నేతలంతా
ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా నాటి నుంచి అమరావతి రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. న్యాయ పోరాటం చేసారు. హైకోర్టులో కేసు నడుస్తున్న సమయంలోనే జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను అసెంబ్లీలో ఉప సంహరించుకుంది.
ఆ తరువాత హైకోర్టు కూడా అమరావతి నిర్మాణం ప్రారంభించాలని తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం నుంచి పూర్తి సానకూలత లేదంటూ.. అమరావతి రైతులు పోరాటం కంటిన్యూ చేస్తున్నారు. ఆ ఉద్యమం ప్రారంభించి సెప్టెంబర్ 12వ తేదీకి వెయ్యి రోజులు పూర్తి కానుంది. దీంతో..అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో బహిరంగ సభకు అమరావతి జేఏసీ నేతలు నిర్ణయించారు. ఇందులో హాజరయ్యేలా ఇప్పటికే వైసీపీ మినహా అన్ని పార్టీల అధినేతల నుంచి హామీ పొందారు.

టార్గెట్ జగన్.. ఏకైక నినాదంతో
ఆ రోజు జరిగే సభలో టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేనాని పవన్ కళ్యాణ్.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. కాంగ్రెస్ - కమ్యూనిస్టు పార్టీల నేతలు హాజరు కానున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ- టీడీపీ కలిసి పోటీ చేయగా.. పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలిచారు. 2019 ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసిన ఈ మూడు పార్టీలు అమరావతి విషయంలో మాత్రం స్థానిక రైతుల డిమాండ్ కు అనుగుణంగా.. అమరావతి ఏకైక రాజధాని డిమాండ్ వినిపిస్తున్నాయి.
ఇక..వచ్చే ఎన్నికల్లో తిరిగి టీడీపీ - జనసేన కలిసి పొత్తు తో ముందుకెళ్లటం ఖాయమనే ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. దీని పైన కొద్ది రోజుల క్రితం రెండు పార్టీల నుంచి సంకేతాలు వచ్చినా..ముందడుగు వేయటంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. బీజేపీ - జనసేన ఇప్పటికే కలిసి ఉండటంతో...టీడీపీని కలుపుకొనే అంశం పైన క్లారిటీ లేదు. జగన్ వ్యతిరేక ఓటు చీలకండా ఉండాలంటే అందరూ కలిసి రావాలనేది పవన్ కళ్యాణ్ నినాదం.

అక్కడ నుంచే ఆరంభం.. బీజేపీ కొనసాగేనా
ఎలాగైనా జగన్ ను అధికారం నుంచి దూరం చేయాలనేది చంద్రబాబు లక్ష్యం. ఏపీ బీజేపీలో చంద్రబాబుకు మద్దతు విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బీజేపీ జాతీయ నాయకత్వం చంద్రబాబు కు అనుకూలంగా లేదనే ప్రచారం జరుగుతోంది. అయితే, వైసీపీ పొత్తుల వ్యవహారంలో ఈ మూడు పార్టీల అడుగులను జాగ్రత్తగా గమనిస్తోంది.
ఈ దశలో జనసేనాని దసరా నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సమయంలో అమరావతి కేంద్రంగా జరుగుతున్న సభలో ఈ మూడు పార్టీలకు చెందిన నేతలు 2019 ఎన్నికల తరువాత ఒకే వేదిక మీదకు రావటం ఇదే ప్రధమం. ఇక్కడ వారంతా అమరావతికి మద్దతుగా.. జగన్ కు వ్యతిరేకంగా గళం వినిపించటం ఖాయం. దీని ద్వారానే..భవిష్యత్ లోనూ ఐక్య పోరాటాలకు పిలుపునిచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బీజేపీ వీరితో కలిసి ఉంటుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. దీని ద్వారా జగన్ లక్ష్యంగా 2024 ఎన్నికలకు చంద్రబాబు - పవన్ తొలి అడుగు ప్రారంభిస్తున్నారనే వాదన వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications